నేటి వార్త మాలిక‌

క‌ల్తీలేని వార్త‌లు క‌ల‌క‌లం రేపే క‌థ‌నాలు

ఉగ్రవాది దాడిలో మరణించిన మధుసూదన్ రావు కుటుంబ సభ్యుల్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డిలు పరామర్శించారు. మధుసూదన్ రావు కుటుంబ సభ్యులకి వారు ప్రభుత్వం తరపున రూ. 10 లక్షల చెక్కును అందచేశారు. ప్రభుత్వం అన్నీ విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాలెం పంచాయతీలో మత్స్యకారుల సేవలో వేట నిషేధకాల భృతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని మత్స్యకారులకు చెక్కులను అందచేశారు. మత్స్యకారుల ఉన్నతికి పాటుపడే నాయకుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు.

బుచ్చిరెడ్డిపాళెంలో 2కే హెల్తీ రన్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో కమిషనర్‌ బాలకృష్ణ, తహసీల్దారు, వెంకటేశ్వర్లు, ఎంపీడీవో శ్రీహరి, సీఐ శ్రీనివాసులు రెడ్డి, ఎస్ఐ సంతోష్ రెడ్డి పాల్గొన్నారు.. యువతతో పోటాపోటీగా వారు రన్నింగ్ చేశారు.

ఇందుకూరుపేటలోని మాగుంట కోటంరెడ్డి ఉన్నత పాఠశాలలో 1992-93 సంవత్సరం పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. 32 ఏళ్ల తరువాత కలుసుకున్న మిత్రులందరూ తమ చిన్ననాటి స్కూల్ జ్ఞాపకాలను నెమరవేసుకొని సరదాగా గడిపారు. విద్యాబుద్దులు నేర్పించిన గురువులను ఘనంగా సన్మానించారు.

కావలి మినీ స్టేడియం మైదానంలో ఆదివారం వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్రై సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశిధర్ రెడ్డి పాల్గొని 155 మంది దివ్యాంగులకి ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. ట్రై సైకిళ్లకు ఏ సమస్య వచ్చినా వాటి మరమ్మతులు చేసే బాధ్యత వీపీఆర్ ఫౌండేషన్ తీసుకుంటుందని వేమిరెడ్డి హామీ ఇచ్చారు.

ఇందుకూరుపేట మండలంలో జిల్లా విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులు నిర్వహించారు. సమస్యలపై నిరంత‌రం ఎస్ఎఫ్ఐ పోరాడుతూ విద్యార్థులను చైతన్యం పరుస్తుందని రాష్ట్ర అధ్యక్షులు నవీన్ కుమార్ అన్నారు. విద్యార్థులను చైతన్య పరులుగా నిత్యం కృషి చేస్తామని ఆయన చెప్పారు.

నెల్లూరు చిల్డ్రన్స్ పార్కులో…సీనియర్ కన్సల్టెంట్, ఫిజియోథెరఫిస్ట్ డాక్టర్ శ్రీదేవి ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. అనేక వ్యాధులకి, మందులకి ఫిజియోథెరిఫీ ప్రత్యామ్నాయం అని డాక్టర్ శ్రీదేవి తెలిపారు.

కలువాయిలోని ముదిరాజ్ పాళెంలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.

డెల్టా హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పోకల రవి ఆధ్వర్యంలో నగరంలోని 45వ డివిజన్ జేమ్స్ గార్డెన్ లో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ప్రజలకి ఉచితంగా పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. మంత్రి నారాయణ స్ఫూర్తితోనే మెగా వైద్య శిబిరం చేపట్టానని డాక్టర్ పోకల రవి తెలిపారు

రాపూరు మండలం ఆకలి వసల పంచాయతీలో వెలసి ఉన్న శ్రీ బుగ్గేశ్వరస్వామి ఆలయంలో సీతారాముల వారి కళ్యాణం కమనీయంగా సాగింది. స్వామి, అమ్మవార్ల విగ్రహాలకు విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. సీతారాముల వారి కళ్యాణాన్ని భక్తులు తిలకించి తరించారు.

జడ్పిటిసి మాజీ సభ్యులు, కొత్తపట్నం గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ ప్రసాద్ గౌడ్ కోరిక మేరకు కోట మండలం శ్రీనివాససత్రం గ్రామానికి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి విచ్చేశారు. భూములు కోల్పోతున్న బాధితుల తరఫున ఆయ‌న మాట్లాడారు. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని ప్రసాద్ రెడ్డి హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *