నెల్లూరు నగరంలో కొవ్వొత్తుల ప్రదర్శన
మృతుల కుటుంబాలకు జనసేన కన్నీటి నివాళి
- నెల్లూరు నగరంలో కొవ్వొత్తుల ప్రదర్శన
కాశ్మీర్ కొండల్లో టెర్రరిస్టుల మారణకాండను నిరసిస్తూ బుధవారం నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. సుమారు 200 మంది జనసేన నాయకులు, కార్యకర్తలు నగరంలోని గాంధీబొమ్మ వద్దకు చేరుకుని అమరులైన వారికి నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్బాబు మాట్లాడుతూ… జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారన్నారు. అందులో భాగంగా బుధవారం జాతీయ జెండాను అవనతం చేయడం జరిగిందని, అదే విధంగా కొవ్వొత్తులతో నివాళులు అర్పించామన్నారు. గురువారం, శుక్రవారం కూడా నిరసన,మానవహారం నిర్వహిస్తామన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఒకేసారి 28 మందిని పొట్టన పెట్టుకోవడం బాధాకరమన్నారు. అందులో మన రాష్ట్రం నుంచి ఇద్దరు ఉండటం మన జిల్లా వాసి వారిలో ఒకరు అవటం హృదయవిదారకం అని ఇలాంటి చర్యలకు మరోసారి ఎవ్వరూ చేయకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.