త్వరలో అధికారికంగా ఖరారు కానున్న సీఎం పర్యటన
అధికారులు సంసిద్ధంగా ఉండాలని మంత్రి ఆనం ఆదేశం
మే నెల 1న ఆత్మకూరులో సీఎం పర్యటన
- త్వరలో అధికారికంగా ఖరారు కానున్న సీఎం పర్యటన
- అధికారులు సంసిద్ధంగా ఉండాలని మంత్రి ఆనం ఆదేశం
వచ్చే మే నెల 1వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు ఆత్మకూరులో పర్యటించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఇప్పటికే సీఎం కార్యాలయం నుంచి తనకు ప్రాథమికంగా సమాచారం అందిందని, త్వరలోనే అధికారికంగా ఖరారు కావాల్సి ఉందని మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం పర్యటన కు ముందస్తుగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులతో ప్రాథమికంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మేనెలా ఒకటిన ఆత్మకూరు సమీప గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం, నారంపేట వద్ద ఎమ్ ఎస్ ఎమ్ ఈ పార్కు ప్రారంభోత్సవం, పార్టీ కార్యకర్తలతో సమావేశంలో సీఎం పాల్గొంటారని ప్రాథమికంగా సమాచారం అందినట్టు మంత్రి చెప్పారు. సీఎం పర్యటనకు సంబంధించి అనువైన ప్రాంతాన్ని హెలిప్యాడ్ కోసం ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. ఆర్ అండ్ బి, రెవెన్యూ, పోలీసు, ఎలక్ట్రికల్, మున్సిపల్ శాఖల అధికారులు సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సమన్వయంతో చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. త్వరలో సీఎం పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఖరారు కానున్నట్లు మంత్రి చెప్పారు. ఈ సమావేశంలో ఆత్మకూరు ఆర్డీవో పావని, డీఎస్పీ వేణుగోపాల్, ఆర్ అండ్ బి ఎస్ ఈ గంగాధర్, ఈఈ మురళీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.