కలగా మిగిలిపోయిన రాజుపాళెంలోని ఎస్సీ, ఎస్టీ కాలనీ వాసుల రోడ్డు
ప్ల కార్డులతో రోడ్డెక్కిన చిన్నారులు, గ్రామస్థులు
స్పందించిన డిప్యూటీ సీఎం…ముందుకు పడని అడుగు
- కలగా మిగిలిపోయిన రాజుపాళెంలోని ఎస్సీ, ఎస్టీ కాలనీ వాసుల రోడ్డు
- ప్ల కార్డులతో రోడ్డెక్కిన చిన్నారులు, గ్రామస్థులు
నెల్లూరు జిల్లా, కలువాయి మండలం, రాజుపాలెం గ్రామంలోని ఎస్సీ, ఎస్టి కాలనీవాసులకు రోడ్డు ఒక కలగా మిగిలిపోతుంది. ఎన్నికల సమయంలో రోడ్లు వేస్తామని నాయకులు చెప్పే మాటలు హామీకు మాత్రమే పరిమితం అవుతున్నాయని గిరిజన కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వస్తే రోడ్లు చెరువులను తలపిస్తుంటాయని వాపోయారు. వర్షాకాలంలో కనీసం విద్యార్థులు పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి, ఎవరికైనా ఆరోగ్య పరిస్థితి బాగాలేక పోతే 108 వాహనం కూడా రాలేని దుస్థితి. కొన్ని నెలల క్రితం రాజుపాలెం రోడ్డు సమస్యను ఓ వేదికలో గ్రామ చిన్నారులు డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే స్పందించారు. సంబంధిత అధికారులు ఆ గ్రామంలో పర్యటించి రోడ్డుకు సంబంధించి అంచనా వ్యయాన్ని ప్రకటించారు. దీంతో అప్పట్లో తమ గ్రామానికి రోడ్డు వస్తుందని గిరిజనులలో కొత్త ఆశలు చిగురించాయి. నెలలు గడుస్తున్న రోడ్డు నిర్మాణ పనులు జరగకపోవడంతో గిరిజనులు తీవ్ర నీరసలో ఉన్నారు. గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు జరిగేలా డిప్యూటీ సీఎం, పంచాయతీ శాఖ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. ఈ మేరకు చిన్నారులు, గ్రామస్థులు ప్ల కార్డులు చేతపట్టి…నిరసన తెలియజేశారు. పవన్ సార్ మీరైనా స్పందించి…మా కాలనీకి రోడ్డు వేయించండి సార్ అంటూ చిన్నారులు నినాదాలు చేశారు.