నెల్లూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేతో మంత్రి నాదెండ్ల భేటీ
నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై చర్చించిన ప్రజా ప్రతినిధులు.
ప్రతీ గింజా కొనుగోలు చేస్తాం
రైతులు ఆందోళన చెందొద్దు..!!
-నెల్లూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేతో మంత్రి నాదెండ్ల భేటీ
- నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై చర్చించిన ప్రజా ప్రతినిధులు.
ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన నెల్లూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో అసెంబ్లీ లోని మంత్రి ఛాంబర్ లో మంగళవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు పరిస్థితి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు జిల్లాలో 15 వేల టన్నుల పైగా ధాన్యం కొనుగోలు పూర్తి చేసామని తెలిపారు.
రైతులు ఆందోళన చెందవద్దని, ప్రతి గింజా కొనుగోలు చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలు జరిగిన 24గంటల్లోపే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని తెలిపారు.
రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు కొనసాగుతుందని, గన్ని బ్యాగులు, ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. మిల్లర్స్ తో చర్చించి ధాన్యం కొనుగోలు పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకుంటామనీ ఈసందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. అలాగే.. తేమ శాతం 17 -20 ఉన్న ధాన్యాన్ని సైతం రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ధాన్యం అమ్మకం మరింత సులభతరం చేసేందుకు 7337359375 నెంబర్కు “Hi” మెసేజ్ పంపితే రైతులు ధాన్యం అమ్మకం వివరాలు తెలుసుకోవచ్చని వెల్లడించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి మహమ్మద్ ఫరూక్, ఎంఎల్ఏ లు సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి , వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ, దగుమాటి వెంకట కృష్ణారెడ్డి, పౌర సరఫరాల సంస్థ ఎండీ మన్సూర్ పాల్గొన్నారు.