మర్చి 9న 105 శంకుస్థాపనల కార్యక్రమాలు
- కార్యకర్తల కష్టం, కన్నీళ్లు నాకు తెలుసు
- కార్యకర్తల ప్రయోజనాలే నాకు ముఖ్యం.. వారికోసం ఎందాకైనా వస్తా
- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 9 నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి రూ. 191 కోట్ల నిధులు
-ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి, టీడీపీ నేత గిరిధర్రెడ్డి
ఈనెల 9వ తేదీన మనం చరిత్ర సృష్టించబోతున్నామని.. ఆరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో.. 105 శంకుస్థాపనల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నామని.. అందులో తనతోపాటు తన తమ్ముడు గిరిధర్రెడ్డి.. ప్రజల భాగస్వామ్యంతో ఉదయం ఆరున్నర గంటలకు తొలి శంకుస్థాపనతో మొదలుపెట్టడం జరుగుతుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. ఈమేరకు ఆయన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ నియోజకవర్గ అర్బన్ డివిజన్ల నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
భారతదేశ చరిత్రలో ఒకేరోజు 105 శంకుస్థాపనలు చేయడం.. అందునా.. స్థానిక ప్రజలచే శంకుస్థాపకులు చేయడం ఓ చరిత్ర అవుతుందన్నారు. 51 చోట్ల తానే స్వయంగా పాల్గొంటానని.. మరో 54 చోట్ల కూటమి పార్టీ నేతలతో కలసి తన తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొంటారని శ్రీధర్రెడ్డి తెలిపారు. కేవలం 60 రోజుల్లో ఈ పనులను పూర్తిచేసి, ప్రజలచేతే ఘనంగా ప్రారంభోత్సవాలు చేస్తామని.. రాష్ట్రానికే ఆదర్శంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని నిలుపుదామని ఆయన పిలుపునిచ్చారు. ఎక్కడా హంగు, ఆర్భాటాలు వద్దని.. మర్చి 9న కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని.. ఆయన కోరారు. అలాగే.. కార్యకర్తల కష్టం, కన్నీళ్లు తనకు తెలుసని.. కార్యకర్తల ప్రయోజనాలే తనకు ముఖ్యం అన్నారు. వారికోసం ఎందాకైనా వస్తానన్నారు. ప్రజలకు పనికివచ్చే పనులు చేయాలని.. రాజకీయ వేధింపులు వద్దని ఈసందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. అనంతరం కోటంరెడ్డి గిరిధర్రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంఛార్జులు, కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.