మళ్ళీ రైతు బజార్ అస్తవ్యస్తం..

కావలి పట్టణంలో రైతు బజారుకు వచ్చే వినియోగదారులకు తప్పని ఇక్కట్లు

పార్కింగ్ స్థలంలో మళ్ళీ యదావిధిగా అమ్మకాలు. రోడ్డు పైకి వాహనాలు

నత్త నడకన సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం కోసం తవ్విన భారీ గుంత పనులు

కావలి పట్టణంలో ఎంతో కీలకమైన రైతు బజారు మళ్ళీ అస్తవ్యస్తంగా మారింది. ఇక్కడకు వచ్చే వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా ఇక్కడకు వచ్చేవారికి పార్కింగ్ ప్రధాన సమస్యగా మారింది. వాహనాలను రోడ్డు పైకి నిలుపుకునే పరిస్థితి మళ్ళీ వచ్చింది. గతంలో రైతు బజారు పార్కింగ్ స్థలాన్ని ఆక్రమించి వ్యాపారాలు చేస్తుండగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గమనించి అక్కడి దుకాణాల తొలగింపుకు ఆదేశించారు. మున్సిపాలిటీ, పోలీసులు ఇక్కడ ఆక్రమణలు తొలగించారు. ప్రారంభం శూరత్వం అన్నట్లు మొదటి సమస్య ఉత్పన్నం అవుతుంది. టమాటా బాక్స్ లు అమ్మేవాళ్ళు, తోపుడు బండ్లు పెట్టి వ్యాపారాలు చేస్తూ పార్కింగ్ స్థలాన్ని ఆక్రమించారు. రైతుబజార్ నిర్వాహకులు వీరిని తొలగించమంటే ఏదోక రాజకీయ నాయకుడు సిఫారసు చేస్తూ వారిని అక్కడే ఉంచుతున్నారు. పక్కనే ఒకటో పట్టణ పోలీసు స్టేషన్, డిఎస్పీ కార్యాలయం ఉన్నా ఇక్కడి ట్రాఫిక్ సమస్య కానరావడం లేదు. రైతు బ‌జారుకు నెలకు రెండు లక్షల రూపాయలకు పైగా ఆదాయం వస్తుంది. ఇక్కడ ఒక వాచ్ మ్యాన్ ను నియమించి పార్కింగ్ నిర్వహణ చేయవచ్చు కదా అనే డిమాండ్ వినొస్తుంది. మరో పక్క లోపల సెప్టిక్ ట్యాంక్ నిర్మాణానికి రెండు నెలల కిందట భారీ గుంట తవ్వి పనులు చేయకుండా ఆపేశారు. దీంతో లోపల పక్క కాలుతీసి కాలు వేసే పరిస్థితి లేదు. గురువారం నుంచే పనులు ప్రారంభిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ పనులు ఎప్పుడు పూర్తవుతాయోనన్న సందేహం తలెత్తుతుంది. ఇప్పటికైనా ఇక్కడ పార్కింగ్ సమస్య ను పరిష్కరించాలని, సెప్టిక్ ట్యాంక్ పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *