నెల్లూరు జిల్లాలో ఏఎంసీ కమిటీ చైర్మన్ల ఎంపికకు రిజర్వేషన్ల తంటా
రాష్ట్రంలో నెల్లూరు తప్పా అన్నీ జిల్లాల్లో కసరత్తు పూర్తి
ఏఎంసీ రిజర్వేషన్ల కేటాయింపుకు నెల్లూరు జిల్లాలో సందిగ్ధం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తవుతుంది. పార్టీ గెలుపుకు, తమ అభిమాన నేత విజయానికి శక్తి వంచన లేకుండా కష్టపడిన ద్వితీయ శ్రేణి నాయకులు నామినేటెడ్ పదవుల కోసం కళ్ళల్లో వత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. నియోజకవర్గాల్లో ప్రాధాన్యం ఉన్న ఏఎంసీ పదవి కోసం నేతలు గంపెడు ఆశలు పెట్టుకొని ఉన్నారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్కెట్ కమిటీల నియామకానికి పచ్చజెండా ఊపారు. పార్టీలో క్రియాశీలంగా ఉన్న నేతలకే పదవులు ఇవ్వాలని ఆంక్షలు పెట్టారు. ఖచ్చితంగా క్లస్టర్ యూనిట్, ఇతర పార్టీ పదవుల్లో అర్హతగా నిర్ణయించారు. దీంతో ఆశావాహులు అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకోవడంలో నిమగ్నమైపోయారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేలకు ఏఎంసీ చైర్మన్ల ఎంపిక కత్తిమీద సాములా మారింది. డజన్ల కొద్ది ఆశావాహులు ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారు. మరోపక్క ఏఎంసీ చైర్మన్ల ఎంపిక రిజర్వేషన్లు పెద్ద సమస్యగా మారింది. నెల్లూరు జిల్లాలో రిజర్వేషన్లు ఎలా ఉన్నాయి…? ఎమ్మెల్యేలు వారి ప్రాంతాలకు ఎవరిని కోరుతున్నారు…? రాష్ట్రంలో అన్నీ జిల్లాల నుంచి రిజర్వేషన్ల కసరత్తు పూర్తి చేసినా పంపించిన నెల్లూరు జిల్లా నుంచి ఇంకా ఎందుకు పంపించలేకపోయారు…? తెలుసుకోవాలంటే…ఎన్3 న్యూస్ చూడాల్సిందే…
నెల్లూరు జిల్లాలో కావలి, కందుకూరు, ఉదయగిరి, కోవూరు, నెల్లూరు, సర్వేపల్లి, రాపూరు, ఆత్మకూరులో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలు ఉన్నాయి. ఈ కమిటీల ఎంపిక పక్కా రిజర్వేషన్ ప్రక్రియ జరగాలి. ఈ కమిటీలకు చైర్మన్లు ఓసీ యాభై శాతం, బీసీ లకు 29 శాతం, ఎస్సీలకు 16 శాతం, 8 శాతం ఎస్టీలకు కేటాయించాలి. ఇలా నెల్లూరు జిల్లాలో 8 మంది చైర్మన్లు నాలుగు ఓసీలకు, మిగిలిన బీసీ, ఎస్సీలకు, ఎస్టీలకు కేటాయించాలి. కానీ జిల్లాలో 8మంది ఎమ్మెల్యేలు అందరూ ఓసీ లకే పట్టుబడుతున్నారు. ఇక్కడే పెద్ద చిక్కొచ్చిపడింది. జిల్లాలో ఉదయగిరి, ఆత్మకూరు ఎమ్మెల్యేలు వారి చైర్మన్ల విషయంలో అడగకపోయినా మిగిలిన వారంతా ఓసీలకే కేటాయించాలని కోరుతున్నారు. జిల్లాలో గత చైర్మన్లు రిజర్వేషన్ పరిశీలిస్తే కావలి బీసీ, కోవూరు ఎస్టీ, ఉదయగిరి ఓసీ, ఆత్మకూరు మైనారిటీ, కందుకూరు ఎస్సీలకు కేటాయించి పోటీ ఉండడంతో రద్దు చేసి అధికారుల పాలనలో ఉంచారు. నెల్లూరు ఓసీ, రాపూరు ఓసీ, సర్వేపల్లి ఓసీలు పదవులు అనుభవించారు. ఈ ప్రకారం ఈ సారి రోస్టర్ పద్దతి పాటించాలని కొందరు ఎమ్మెల్యేలు కోరుతున్నారు. దీంతో ఇక్కడ రిజర్వేషన్ పద్దతిపై సందిగ్ధత నెలకుంది. జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ, జిల్లాలో ఎమ్మెల్యేలతో ఒక సమన్వయ సమావేశం నిర్వహిస్తేనే ఈ సమస్య కొలిక్కి వస్తుందని అంతా భావిస్తున్నారు. అప్పటివరకు ఆశావాహుల్లో టెంక్షన్ తప్పదు.