మా బతుకులు.. మేం బతుకుతున్నాం
ఇందిరమ్మ హయాం నాటి నుండి వ్యాపారాలు చేసుకుంటున్నాం
మా కడుపు కొట్టారు.. దేవుడు చూస్తున్నాడని వాపోయిన బుచ్చి రోడ్డుమార్జిన్ వ్యాపారులు
ఇందిరమ్మ హయాం నాటి నుండి ఎన్నో ఏళ్లుగా బస్టాండు సెంటర్లలో తోపుడుబండ్లపై చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారిని అధికారులు తొలగించడం తమ పొట్టకూటిపై కొట్టడమేనని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం వ్యాపారస్తులు అన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఒక్కసారిగా చెప్పడం దారుణమని వాపోయారు. దళితులు, బిసిలు, మైనారిటీలు చిరు వ్యాపారులు చేసుకుంటూ బతుకుతున్నారని తెలిపారు. ఇప్పటికే పండ్లు కుళ్లిపోయి వేల రూపాయలు నష్టపోయామన్నారు. ఎండనక, వాననకు కుటుంబ పోషణ కోసం మా బతుకులు మేం బతుకుతుంటే.. అధికారులు రోడ్లపైకి వచ్చి వ్యాపారాలు చేయొద్దని హెచ్చరించారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారస్తులకు వసతులు కల్పించి ఆక్రమణలు తొలగించుకుంటే తమకు ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు.. తోపుడు బండ్ల కార్మికుల సమస్యలను పరిష్కరించి, వ్యాపారాలు చేసుకోవటానికి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు చైర్ పర్సన్ సుప్రజకు వినతిపత్రం అందజేశారు. సమస్యను ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి దగ్గరకు తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని బుచ్చి చైర్ పర్సన్ చెప్పినట్లు తెలిపారు..