అగ్రిగోల్డ్ భూముల్లో కలపపై కన్ను..
దమ్ముంటే పట్టుకోండి అధికారులారా…
పట్టుకుంటే వదిలేస్తా జామాయిల్ కొట్టుడు అంటూ సవాల్
ఇప్పటికే భారీగా జామాయిల్ కర్ర తరలింపు
N3 న్యూస్ కు స్పందించిన అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ – ఏపీ సీఐడి ఉన్నతాధికారులకు ఫిర్యాదు
లక్షలాది పేదలు, సామాన్యులు చెమట నుంచి పెరిగిన కలప అది. పాలకుల నిర్లక్ష్యానికి అక్రమార్కులకు వరంగా మారింది. అధికారం అండదండలతో యదేచ్చగా తరలిపోతుంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో పుష్ప పార్ట్ 1 పార్ట్ 2 సినిమాను తలపించేలా కోట్ల రూపాయల అగ్రిగోల్డ్ కలప సంపదను కొల్లగొడుతున్నారు. ఇక్కడ ఓ జూనియర్ పుష్ప కనుసన్నల్లో అంతా సాగుతుంది. దమ్ముంటే పట్టుకోండి అధికారులారా… పట్టుకుంటే వదిలేస్తా జామాయిల్ కొట్టుడూ అంటూ సవాల్ విసురుతున్నాడు. ఇక్కడ జూనియర్ పుష్ప ఎవరూ…? వెనుకుండి నడిపిస్తున్న మంగళం శ్రీను ఎవరో తెలుసుకోవాలంటే ఎన్ త్రీ న్యూస్.. చూడాల్సిందే…..
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో 1600 ఎకరాల్లో అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయి. అగ్రిగోల్డ్ లో పైసా పైసా కూడబెట్టుకుని దాచుకున్న డబ్బులతో ఈ భూములు కొన్నారు. అగ్రిగోల్డ్ బిషాణం ఎత్తాక ఈ భూములను ఏపీ ప్రభుత్వం సీఐడీ ఆదీనంలో ఉంచింది. వీటిల్లో గత 25 సంవత్సరాలుగా వరికుంటపాడు, దుత్తలూరు, కలిగిరి, కొండాపురం మండలాల్లో జామాయిల్ తోటలు పెంచారు. 20 సంవత్సరాలు కావడంతో కర్ర భారీ సైజ్ కి వచ్చింది. టన్ను కర్ర 7 వేల రూపాయల నుంచి కర్ర సైజ్ ను బట్టి టన్ను 10 వేల రూపాయలు పలుకుతోంది. దీంతో అక్రమార్కుల కన్ను ఈ జామాయిల్ పై పడింది. జనవరి నెలాఖరు నుంచి వరికుంటపాడు మండలం కనియంపాడు, కలిగిరి మండలం తెల్లపాడులో కలపను తరలిస్తున్నారు. మొదటి రోజుల్లో 20 టన్నులు లెక్కన రోజుకు సుమారు 20 లారీలు చొప్పున తరలించేవారు. ఇటీవల మీడియాల్లో కథనాలు రావడంతో ఆ స్మగ్లర్ యూగో దెబ్బతింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 40 టన్నుల లారీలను రాగంలోకి దింపి కర్రను తరలిస్తున్నారు. బుచ్చిరెడ్డి పాళెంకి చెందిన ఓ వ్యక్తి ఈ స్మగ్లింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. స్థానిక రెవెన్యూ, పోలీసు, మీడియాలను అటు వైపు రాకుండా అన్నీ ఆయనే చక్కబెడుతున్నట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారంపై పుష్ప – 3 అంటూ ఎన్ త్రీ న్యూస్ కళ్లకు కట్టినట్లు చూపించింది. దీంతో అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు స్పందించారు. ఏపీ సీఐడీ ఉన్నతాధికారులకు, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. ఇటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల అసోసియేషన్ సభ్యులు ఈ భూములను పరిశీలిస్తామని ఎన్ త్రీ న్యూస్ తో తెలిపారు.