సీడబ్ల్యూసీ శాశ్వత సభ్యుడు కొప్పుల రాజు
నెల్లూరు ఇందిరాభవన్లో జై భీమ జై బాపు జై సంవిధాన్
75 ఏళ్ల స్వతంత్ర భారతావనిని సమైక్యంగా ఉంచిన ఘనత రాజ్యాంగందేనని..అటువంటి రాజ్యాంగాన్ని ప్రసాదించిన రాజ్యాంగ నిర్మాతలను అగౌరవంగా, హేళనగా పార్లమెంట్లో మాట్లాడడం బిజెపి దిగజారుడుతనానికి నిదర్శనమని సీడబ్ల్యూసీ శాశ్వత సభ్యుడు కొప్పుల రాజు అన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు…నెల్లూరులోని ఇందిరాభవన్లో డిసిసి అధ్యక్షుడు దేవకుమార్ రెడ్డి అధ్యక్షతన జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కొప్పలరాజు పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగంలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలోని అన్ని వర్గాలపై ఉందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు, దాని గొప్పతనాన్ని గ్రామ మండల స్థాయికి తీసుకువెళ్లేందుకు రాహుల్ గాంధీ ఈ ఏడాది పాటు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారని అన్నారు. అనంతరం ఓబిసి రాష్ట్ర అధ్యక్షుడు సొంటి నాగరాజు మాట్లాడుతూ… దేశ సంపదంత కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమైనదని అన్నారు. రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు మస్తాన్ వలి మాట్లాడుతూ…పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ 10 సంవత్సరాల ఎన్డీఏ పాలనలో ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువకులు, సామాజికవేత్తలు, విద్యావేత్తలు,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నట్లు తెలిపారు.