స్వచ్ఛ ఆంధ్ర
స్వచ్ఛ దివస్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
గ్రామస్థులతో ఆప్యాయంగా గడిపిన సీఎం
సీఎం చంద్రబాబు పర్యటన నెల్లూరు జిల్లా విజయవంతం
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్చాంధ్ర ,స్వచ్చ దివస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గానికి విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎంకి జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అపూర్వ స్వాగతం పలికారు. ఎటువంటి ఆర్భాటాలకు తావు లేకుండా సామాన్య వ్యక్తిలా రాష్ట్ర ముఖ్యమంత్రి తమ గ్రామం నలుచెరుగులా పర్యటించడంతో గ్రామస్తులు ఆనందపరవశులయ్యారు. తొలుత దూబగుంట గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించిన ముఖ్యమంత్రి గ్రామంలో భీమని హరికృష్ణ ఇంటిలో ఇంకుడుగుంతను పరిశీలించి ఆయా వివరాలు తెలుసుకున్నారు. మరో గ్రామస్తురాలు గొర్రెపాటి సుశీల ఇంటి వద్ద ఆగి తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా సేకరిస్తున్నారా అని విచారిస్తూ ముందుకు సాగారు. అదే దారిలో ఎన్ సి సి విద్యార్థులు చక్కగా వరుస క్రమంలో నిలబడి ముఖ్యమంత్రి ని సాదరంగా గౌరవించారు. అనంతరం బెల్లంకొండ వెంకటేశ్వర్లు అనే ముదుసలి ఇంటి వద్ద ఆగి వారిని పరామర్శించిన ముఖ్యమంత్రి ఎన్ టి ఆర్ భరోసా పెన్షన్ అందుతుందాయని ఆరా తీశారు. వారు సేంద్రీయ పద్ధతిలో సాగుచేసిన అరటిపండ్ల గెలను ముఖ్యమంత్రికి ఆప్యాయంగా అందజేశారు. సీఎం వెంట రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, డోలా బాల వీరాంజనేయస్వామి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణ కాంత్, సి డి యం ఎ సంపత్ కుమార్, నెల్లూరు మున్సిపల్ కమిషనర్ సూర్య తేజ, కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీ పూజ, మాజీ శాసన సభ్యులు దివి శివరాం పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటన విజయవంతం కావడంతో…జిల్లా పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.