డిప్యూటీ మేయర్ ఎన్నికపై సుదీర్ఘ చర్చ
మంత్రి నారాయణ నిర్ణయమే అంతిమన్న కోటంరెడ్డి
ప్రజా సమస్యలతో పాటు కొన్ని కీలక అంశాలను ప్రస్తావించిన కోటంరెడ్డి సోదరులు
సానుకూలంగా స్పందించిన నారాయణ
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్లతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి అనేక ప్రజా సమస్యలతో పాటు పలు కీలక సమస్యలను నారాయణ దృష్టికి తీసుకొని వచ్చారు. ప్రజలపై వేసిన పన్నులతో పాటు ప్రైవేటు స్థలాల్లో కార్పొరేషన్ ఉన్నతాధికారి పేరుతో వెలసిన స్వాధీన బోర్డులపై కోటంరెడ్డి ప్రశ్నించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కార్పొరేషన్ అధికారుల వ్యవహార తీరు పట్ల ఆయన కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అంశంపై చర్చించారు. గతంలో మైనార్టీ వ్యక్తి డిప్యూటీ మేయర్ గా ఉండటంతో ఈసారి మైనారిటీకి ఈ పదవి ఇవ్వాలా లేదా ఓసీలకు కేటాయించాలా అనే అంశంపై చర్చించారు. సుమారు 55 నిమిషాల సేపు సహృద్భావ వాతావరణంలో చర్చలు సాగాయి. సుమారు 55 నిమిషాల పాటు నెల్లూరు రూరల్ తో పాటు వివిధ అంశాలను వారు చర్చించుకున్నారు. డిప్యూటీ మేయర్ కు సంబంధించి పలు కీలక నిర్ణయం తీసుకున్నారు.