- స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి.. ఇబ్బందులను తెలుసుకున్న కలెక్టర్
- ఆధార్, రేషన్ కార్డుల సమస్యలను సత్వరం పరిష్కరించాలని అధికారులకు ఆదేశం
గిరిజనుల సమస్యలను సత్వరం పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని.. ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దంటూ జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్ ఆదేశించారు. ఈమేరకు కలెక్టర్ శుక్రవారం నెల్లూరు జిల్లా.. కోవూరు నియోజకవర్గం.. కొడవలూరు మండలంలోని గిరిజన కాలనీలలో పర్యటించారు. వారు పడుతున్న ఇబ్బదులను స్వయంగా పరిశీలించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అత్యధిక సమయం వారితో చర్చించారు. చాలా కుటుంబాల్లో ఆధార్ కార్డులు, రేషన్ కార్డుల సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వారు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సంబంధిత అధికారులతో మాట్లాడారు. సత్వరం ఆయా సమస్యలను పరిష్కరించాలని.. ఎలాంటి జాప్యం చేయవద్దని ఆయన ఆదేశించారు. అనంతరం నార్త్ రాజుపాళెంలోని పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో విడవలూరు, కొడవలూరు, ఇందుకూరుపేట, అల్లూరు మండల గిరిజనులతో ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించివారి నుంచి అర్జీలను స్వీకరించారు. గిరిజనుల సమస్యలను పరిష్కరించి.. వారికి అవసరమైన సదుపాయాలు కల్పించడం జరుగుతుందని ఈసందర్భంగా కలెక్టర్ వారికి భరోసా ఇచ్చారు. అనంతరం కలెక్టర్ ఆనంద్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ఆయా మండలాల గిరిజనులు పాల్గొన్నారు.