- నెల్లూరు జాఫర్ సాహెబ్ కెనాల్ పక్కనే షాపులు ఎలా పెడతారు
- కాలువల వెంబడి బ్యూటిఫికేషన్ లేనట్లే కదా
- అయినవారికి లబ్ధి చేకూర్చేందుకే షాపులు ఏర్పాటు చేస్తే వైసీపీ పోరాటం చేస్తుంది
- మీడియా సమావేశంలో మంత్రి నారాయణపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి
నెల్లూరు నగరంలో అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పిన మంత్రి నారాయణ అభివృద్ధిని మరచి.. ఆక్రమణల బాట పట్టారంటూ నెల్లూరు సిటీ వైసీపీ ఇన్ఛార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఆరోపించారు. ఈమేరకు ఆయన నగరంలోని వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. తమ ప్రభుత్వం లో 100 కోట్ల రూపాయలతో జాఫర్ సాహెబ్ కెనాల్, సర్వేపల్లి కాలువలకు రివిట్మెంట్ చేపట్టడంతోపాటు.. వాకింగ్ ట్రాక్, బ్యూటిఫికేషన్ కు శ్రీకారం చుట్టామని తెలిపారు. అయితే మంత్రి నారాయణ.. అభివృద్ధి పనులు మరచి.. సర్వేపల్లి కాలువ వెంబడి.. తనవారికి లబ్ధి చేకూర్చేలా దుకాణాలు ఏర్పాటు చేసి ఆక్రమణలకు తెరలేపుతున్నారని దుయ్యబట్టారు.
కాలువల వెంబడి అభివృద్ధి పనులు మరచి.. ఇలా దుకాణాలు ఏర్పాటు చేస్తే.. అక్కడ ట్రాఫిక్ సమస్య ఏర్పడటమే కాకుండా.. అక్రమలకు మనమే బీజం వేసినట్లు అవుతుందని ఈ సందర్భంగా పర్వతరెడ్డి అన్నారు. ఒకవేళ తనవారికి లబ్ధి చేకూరేలా.. ఇలా షాపులు ఏర్పాటు చేస్తే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఈసందర్భంగా ఆయన ఆయా కాలువల వెంబడి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే దుకాణాలు, వాటి వివరాలను ఫోటోలతో ఆయన మీడియాకు వివరించారు. ఈ సమావేశంలో మైనార్టీ నాయకులు ఖలీల్ అహ్మద్, 13వ డివిజన్ కార్పోరేటర్ ఊటుకూరు నాగార్జున, మహేష్ తదితరులు పాల్గొన్నారు.