- నెల్లూరు రూరల్ కనుపర్తిపాడులో సుమారు 450 ఎకరాల్లో రికార్డులు తారుమారు
- ప్రభుత్వ, ఇరిగేషన్, అటవీ భూములతోపాటు జాయింట్ పట్టాల్లో రియల్ దందా
- ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కనుసన్నల్లోనే ఈ దందా అంతా
- జాయింట్ పట్టాలను విడగొట్టి.. తన పట్టాలు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించిన బాధితులు
- గతంలోనే చర్యలు తీసుకోవాలని కోరినా.. తప్పుడు నివేదికలు ఇచ్చిన ఇద్దరు ఐఏఎస్ అధికారులు
- మరోసారి రీ వెరిఫికేషన్ చేయాలని కలెక్టర్ ఆనంద్ను ఆదేశించిన హైకోర్టు
- స్థలాలు, ప్లాట్లు కొన్నవారిలో ఆందోళన
- ఎన్-3 ఎక్స్క్లూజివ్ స్టోరీ
నెల్లూరు రూరల్లో కొన్ని దశాబ్ధాలుగా రికార్డులు తారుమారు చేసి.. ప్రభుత్వ, అటవీ, ఇరిగేషన్ భూములను కాజేసి.. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో వేలాది కోట్లు దోచేశారు.. ఈ వ్యవహారంలో అధికారులు, కొందరు ప్రైవేటు వ్యక్తుల మెడకు ఉచ్చు బిగుసుకోనుంది. భూ రికార్డుల ట్యాంపరింగ్పై కొందరు కోర్టుకెక్కడంతో సాక్షాత్తు హైకోర్టు సీరియస్ అయ్యింది. 1981 నుంచి 1995 మధ్య కాలంలో జరిగిన ఈ అక్రమాలు, రికార్డుల తారుమారువల్ల నేడు ఆ ప్రాంతంలో సుమారు 450 ఎకరాల భూమి.. రియల్ ఎస్టేట్ వ్యాపారులపరం కావడంతో.. పూర్తి స్థాయిలో పరిశీలించి.. నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్కు హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో.. ఇప్పుడు అక్రమార్కుల్లో హై టెన్షన్ మొదలైంది. ఎవరెవరి మెడకు ఉచ్చు బిగుస్తుందా..? ఎవరు బలవుతారా..? రియల్టర్ల పరిస్థితి ఏంటి..? ప్లాట్లు, భూములు కొన్న వారి పరిస్థితి ఏంటి..? ఇప్పుడిదే అందరిలో గందరగోళపరిస్థితి ఇది…
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని.. కనుపర్తిపాడు చెరువులు, అటవీ భూములు, జాయింట్ పట్టా భూములు, రెవెన్యూ భూములు సుమారు 488.48 ఎకరాల రికార్డులు తారుమారు చేసి.. ఇతరుల పేర్లపై మార్చి.. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో వేలాది కోట్లు దోచుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో.. రెవెన్యూ అధికారులు, రాజకీయ నాయకులు, వ్యాపారులు కుమ్మక్కై ఈ దోపిడీకి ఒడిగట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ జాయింట్ పట్టాభూముల్లో.. 1981 నుంచి 1982 మధ్య రెవెన్యూ రికార్డులను మాయం చేసి.. వాటిని ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో 1995లో అప్పటి కలెక్టర్.. ఈ అక్రమాలపై విచారించి.. అసలైన పట్టాదారుల పేరు మీద మార్పు చేర్పులు చేయమని ఉత్తర్వులు ద్వారా ఆదేశించారు. 1995నుంచి నేటి వరకు ఆ జాయింట్ పట్టాలను విడగొట్టకుండా.. ఎందోటి చంద్రశేఖర్రెడ్డి అనే రియల్ వ్యాపారి.. పోద్బలంతో.. రెవెన్యూ అధికారులు భాగస్తులై.. అక్కడి భూములను ప్లాట్లుగా విడగొట్టి.. ఎలాంటి అనుమతులు పొందకుండా.. విక్రయిస్తూ.. కోట్లు దోచుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. కనుపర్తిపాడులో గత పదేళ్లుగా భూములకు రెక్కలొచ్చాయి. ఓ ఎకరా.. నాలుగు నుంచి 10 కోట్ల వరకు పలుకుతోంది. అంకణం ధరే రెండు లక్షలకు పైగా ఉంది. దీన్నే సొమ్ము చేసుకోవాలని ఆ చంద్రశేఖర్రెడ్డి అనే వ్యక్తి.. నెల్లూరులోని బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై.. కనుపర్తిపాడులోని 72 ఎకరాల రెండు చెరువుల భూమి, 25 ఎకరాల రిజర్వు ఫారెస్టు భూమి, సుమారు 70 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమిని కూడా ప్లాట్లుగా విభజించి.. ఇతర భూముల సర్వే నంబర్లతో విక్రయిస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు.
ఈ సందర్భంగా సుమారు ఐదేళ్ల క్రితం కనుపర్తిపాడుకు చెందిన కోలగట్ల సుధాకర్రెడ్డి తరఫున జీపీఏ హక్కు కలిగిన తిరుమూరు శివకుమార్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆ భూములన్నీ జాయింట్ పట్టా భూములు కావడంతో జాయింట్ పట్టా యాక్టు 2-1965 ప్రకారం విడగొట్టి.. సుధాకర్రెడ్డికి వ్యక్తిగత పట్టాలు ఇవ్వాలని కోరారు. దీనిపై గతంలో విచారించి.. తగు చర్యలు తీసుకోవాలని హైకోర్టు అప్పటి కలెక్టర్ చక్రధర్బాబు, జేసీ కూర్మానాథ్కు ఆదేశించింది. అయితే.. రెవెన్యూ అధికారులు, సిబ్బంది తప్పుడు నివేదికలు ఇవ్వడంతో.. దీనిపై కోర్టు కూడా సీరియస్ అయ్యింది. రెవెన్యూ అధికారులు మళ్లీ రియల్టర్ల ఉచ్చులోపడి.. కోర్టుకు తప్పుడు నివేదిక ఇచ్చినట్లు నిర్థారించారు. మళ్లీ శివకుమార్రెడ్డి కోర్టును ఆశ్రయించగా.. మరోసారి రీ వెరిఫికేషన్ చేసి.. నివేదిక పంపాలని హైకోర్టు ప్రస్తుత కలెక్టర్ ఆనంద్ ను ఆదేశించింది. దీంతో నెల్లూరు రూరల్ రెవెన్యూ యాంత్రంగా అప్రమత్తమైంది. అక్రమాలు జరిగిన సర్వే నంబర్లు, పట్టా నంబంర్లు, ఇతర వివరాలు, ప్రస్తుతం అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారి వివరాలు, లే అవుట్ల పేర్లు ఇతర వివరాలన్నీ సేకరించి.. నివేది సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ వ్యవహారంలో కొన్ని శతాబ్ధాలుగా అక్రమాల్లో భాగస్తులుగా వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులు, సిబ్బంది మెడక్కూడా ఉచ్చు బిగుసుకోనున్నట్లు తెలుస్తోంది. దీనిపై నెల్లూరు ఆర్డీవో నాగసంతోష అనూషను ఎన్-3 ప్రతినిధి వివరణ కోరగా.. ఈ భూములకు సంబంధించిన వివరాలు, కోర్టు ఆదేశాలు.. ఇతర వివరాలను ఆమె వెళ్లడించారు.