- ఇరువురి మధ్య తోపులాట
- విధులు బహిష్కరించిన కార్మికులు, ఉద్యోగులు
- బారాషహీద్ దర్గా నుంచి కార్పొరేషన్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ
నెల్లూరు నగరపాలక సంస్థలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ …విధులు బహిష్కరించి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. నగరపాలక సంస్థ పాలకవర్గం సర్వసభ్య సమావేశం సందర్భంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని నిరసన చేపట్టారు. వివిధ విభాగాల కార్మికులు విధులు బహిష్కరించి బారాషహీద్ దర్గా గ్రౌండ్స్ నుంచి కార్పొరేషన్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కమిషనర్ బయటకు వచ్చి సమస్యల పరిష్కారం కోసం స్పష్టమైన హామీ ఇవ్వాలని నినాదాలు చేశారు. కమిషనర్ రాకపోవడంతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు కార్మికుల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో నగర డిఎస్పీ శ్రీనివాసులు రెడ్డి జోక్యం చేసుకొని కొంతమంది కార్మిక సంఘ ప్రతినిధులు లోపలికి వెళ్లి కమిషనర్ తో చర్చించాలని సూచించారు. ఆయన సూచన మేరకు లోపలికి వెళ్ళిన కార్మిక సంఘ ప్రతినిధులు గంటకు పైగా వేచి చూడగా కమిషనర్ బయటకు రాలేదు.
కమిషనర్ ధోరణి ఇదే రకంగా ఉందని అందుచేతనే సమస్యలు పరిష్కారం కాకుండా పేరుకుపోయి ఉన్నాయని వారు పోలీసులకు తెలిపి అక్కడి నుండి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు కత్తి శ్రీనివాసులు, పెంచల నరసయ్య, నాగేశ్వరరావు, కొండా ప్రసాద్లు మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ కమిషనర్ తమ వైఖరి మార్చుకోవాలని, ఉద్యోగులు కార్మికులు మనసుపెట్టి పనిచేయకుండా మున్సిపల్ కార్పొరేషన్ మనుగడ అంతంతమాత్రంగానే ఉంటుందని అన్నారు. తీరు మారకపోతే నిరవధిక సమ్మె త్వరలోనే చేపడతామని, యూనియన్ లో చర్చించి తేదీ ప్రకటిస్తామని తెలిపారు.