అంతా…నా ఇష్టం

  • స్కూల్ మ‌రుగుదొడ్లు, చెట్లు కూల్చేసి…స‌ర్పంచ్‌
  • గ్రామ‌స్థులు, విద్యార్థుల త‌ల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోని విద్యాశాఖాధికారులు, ఎంపీడీవో
  • కొడ‌వ‌లూరు మండ‌లం రేగ‌డిచెలిక‌లో దారుణం

ఎవ‌రి అనుమ‌తులు లేకుండా పాఠ‌శాల‌లోని మ‌రుగుదొడ్లు, చెట్ల‌ను స‌ర్పంచ్ కూల్చేసిన ఘ‌ట‌న‌… నెల్లూరు జిల్లా కొడ‌వ‌లూరు మండ‌లం రేగ‌డిచెలిక‌లో చోటు చేసుకుంది.

కొడవలూరు మండలం రేగడ చేరిక ఎన్ఎస్ఆర్ గిరిజన కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పాఠశాలకు మరుగుదొడ్లను ప్రభుత్వం నిర్మించి ఉంది. ఈ మరుగుదొడ్లు, చెట్లు, వాట‌ర్ ట్యాంక్‌ల‌ను ఎటువంటి అనుమతులు లేకుండా గ్రామ సర్పంచ్ నల్లావుల శ్రీనివాసులు కూల్చేశాడ‌ని గ్రామ‌స్థులు, విద్యార్థుల త‌ల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఇదేమిటని మండల విద్యాశాఖ అధికారికి జిల్లా అధికారుల‌తోపాటు…రాష్ట్ర కమిషనర్ కూడా ఫిర్యాదు చేశారు. కమిషనర్ వెంటనే స్పందించి బాధ్యులైన వారిపై కేసు నమోదు చేయమని మండల విద్యాశాఖ అధికారి హెచ్ఎం కు ఆదేశాలు జారీ చేశారు. అయినా మండల విద్యాశాఖ అధికారులు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వైఎస్ఆర్సిపి నాయకులకి వంతపాడారు. దీంతో గ్రామస్తులు ఆగ్రహించి లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దీనిపై కావలి డిప్యూటీ డిఇఓ శుక్రవారం ఉదయం విచారణ చేపట్టారు. స్థానికులు ఫిర్యాదును డిప్యూటీ డీఈవో స్వీక‌రించారు. వీటిపై పూర్తి స్థాయిలో విచార‌ణ చేప‌ట్టి…ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకెళ్లి చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని డీఈవో తెలిపారు. అనుమతులు లేకుండా పేద పిల్లలకి అవసరమైన మరుగుదొడ్లు చెట్లను కూల్చేసిన సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *