ప్రతి ఒక్క వస్తువుకి తప్పకుండా బిల్లును తీసుకోవాలి
- నెల్లూరులో నూతనంగా సెంట్రల్ టాక్స్ ఆడిట్ సర్కిల్ కార్యాలయం ప్రారంభం
నెల్లూరు నగరంలోని ఐసిఐసి బ్యాంక్ రెండవ అంతస్తులో నెల్లూరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ టాక్స్ ఆడిట్ సర్కిల్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఐఆర్ఎస్ సెంట్రల్ జీఎస్టీ ఏపీ ఆడిట్ వింగ్ కమిషనర్ పి ఆనంద్ కుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన కమిషనర్ ఛాంబర్ను ప్రారంభించారు. అనంతరం ఆనంద్కుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రజలు దుకాణాల్లో కొన్న ప్రతి ఒక్క వస్తువుకి తప్పకుండా బిల్లును తీసుకోవాలని తెలిపారు. పన్నుల మీద పన్ను కట్టకుండా సులభతరంగా దేశవ్యాప్తంగా ఒకే పన్ను చెల్లించే విధానమే జిఎస్టి పన్ను విధానమని చెప్పారు. అలాగే పన్నులు చెల్లించని వారిపై, తప్పులెక్కలు చూపే సంస్థలపై ఆడిటింగ్ నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆనంద్కుమార్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సర్కిల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.