80 ఏళ్లుగా నివాసం ఉన్న 70 కుటుంవబాలను ఖాళీ చేయమంటున్నారు
-మంత్రి ఆనంను కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వడంలేదు
-అధికారుల మనసు మార్చాలని నాగేంద్రునికి పూజలు
-ఆత్మకూరు మున్సిపాలిటీలో జరుగుతున్న తీరు ఇది
ఆ కాలనీలో 80 ఏళ్లుగా..మూడు తరాలకు చెందినవారు నివాసం ఉంటున్నారు.. ఓట్ల కోసం వారికి హామీలు ఇస్తారుగాని.. వారుంటున్న ప్రాంతంలో పట్టాలు ఇచ్చి.. ఎవరూ న్యాయం చేయడంలేదు. ప్రభుత్వాలు మారిన ప్రతి సారి.. ఓట్ల కోసం వారి ఇంటి గడప తొక్కే ప్రతి నేతకు వారు మొరపెట్టుకుంటున్నారేగాని.. అధికారంలోకి వచ్చాక.. వారి ఊసే ఎత్తడంలేదు సరికదా.. వారిని న్యాయం చేయడంలేదు. కూటమి ప్రభుత్వంపై వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. ఆ కూటమి పార్టీలోని కొందరు వ్యక్తులు వారందర్నీ ఖాళీ చేయించి.. ఆ స్థలాన్ని దోచేయాలని చూస్తున్న వైనం ఇది.. వారి మనసు కరిగించాలని.. అధికారులకు మంచి బుద్ధి ప్రసాదించాలని.. తమకు న్యాయం చేసేలూ చూడాలంటూ.. వారంతా ఆదివారం వారి కులదైవమైన నాగేంద్రునికి పూజలు చేసిన సంఘటన నెల్లూరు జిల్లా.. ఆత్మకూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో చింత చెట్ల కాలనీవాసులు నాగేంద్రునికి పూజలు చేశారు. ఆ కాలనీలోని చెట్ల కింద సుమారు 80 సంవత్సరాల నుండి.. మూడు తరాల కు చెందిన కుటుంబీకులు.. సుమారు 70 మంది జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా.. ఆ భూమి కులగాని రామయ్యకు చెందినదిగా ఓ వర్గం వారు.. అక్కడ నివశించేవారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇందులో భాగంగా.. ఇటీవల ప్రభుత్వం మారిన వెంటనే మళ్లీ వారిని కొందరు ఇబ్బంది పెడుతున్నారు. అంతేకాకుండా.. ఆ భూమి దేవాదాయ శాఖకు చెందినదని.. వెంటనే వాళ్లను ఖాళీ చేయించే పనిలో పడ్డారు. అంతేకాకుండా వారికి నోటీసులు కూడా ఇప్పించారు. దాంతో అక్కడ నివశించేవారంతా.. తీవ్ర మనోవేదనకు గురై.. తమ బాధలు చెప్పుకోవాలని.. న్యాయం కోరేందుకు ఇటీవల మంత్రి ఆనంను కలవడానికి వెళ్లినా.. వారిని కలవడానికి అవకాశం ఇవ్వలేదు. దీంతో దిక్కు తోచన పరిస్థితిలో దేవుడి మీద భారం వేసి.. నాగదేవతకి పూజలు చేసి.. పొంగళ్ళు సమర్పించారు. కూటమి ప్రభుత్వం వస్తే ఏదో న్యాయం చేస్తారని అనుకుంటే ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం సరికాదు అంటూ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు మమ్మల్ని ఇబ్బంది పెట్టె ప్రయత్నం మానుకోవాలని ఆ విధంగా వారికి మంచి మనసు కలగాలని ప్రత్యేక పూజలు చేశారు.