- విశాఖ వయా నెల్లూరు మీదుగా చెన్నైకి భారీగా తరలిపోతున్న గంజాయి
- నెల్లూరు కేంద్రంగానూ దిగుమతి..?
- వయో రూమ్ లు, లాడ్జీలు, గెస్ట్ ఇన్లలో లావాదేవీలు
- ఆదిశగా తనిఖీలు, చర్యలు తీసుకోని పోలీసులు
- రాత్రి జరిగిన సంఘటన కూడా ఇదే కోవకు చెందిందే
- ఓ డీఎస్పీ.. ఇద్దరు సీఐలు గాయాలపాలయ్యేందుకూ ఈ ముఠానే కారణం
- భారీగా పట్టుబడ్డ గంజాయి..? విలువ కోట్లల్లోనే..?
గంజాయికి అడ్డాగా నెల్లూరు మారుతోందా..? విశాఖ.. ఒడిస్సా..ల నుంచి నెల్లూరు మీదుగా చెన్నైకు భారీగా తరలి పోతోందా..? రోడ్డు, రైల్వే మార్గాలనే ఎంచుకున్నారా..? వయా నెల్లూరులో దిగుమతి అవుతోందా..? నెల్లూరు కేంద్రంలోనూ గంజాయి స్లీపర్ సెల్స్ ఉన్నారా..? ఓయో రూములు, లాడ్జీలు, గెస్ట్ ఇన్ లనే వారు కేంద్రాలుగా చేసుకుని లావాదేవీలు చేస్తున్నారా..? ఇంత జరుగుతున్నా పోలీసులు ఎందుకు గంజాయి ముఠాలపై దృష్టి పెట్టడంలేదు..? గతంలో పట్టుబడ్డ నిందితుల నుంచి కూపీ లాగినా.. సమూలంగా ఎందుకు నిర్మూలించలేకపోతున్నారు..? జైలులో రిమాండ్ శిక్ష పూర్తిచేసుకుని.. బయటకు వచ్చేవారి కదలికలు.., వారి దినచర్య, ఏం పనులు చేస్తున్నారు..? ఎక్కడికి వెళ్తున్నారు..? ఎవర్ని కలుస్తున్నారనే కదలికలపై నిఘా ఎందుకు పెట్టడంలేదు.. నిఘా వ్యవస్థలు సాధారణ నేరాలు, చోరీ కేసుల ఛేదనకే పరిమితం అవుతున్నారా..? గతంలో నెల్లూరు నగరం, రూరల్, బుచ్చి, ఆత్మకూరు, కోవూరు, కావలితోపాటు ఉమ్మడి నెల్లూరు జిల్లాల్లోని గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి పలు పోలీసులతోపాటు సెబ్ అధికారులూ.. గంజాయి ముఠాలను పట్టుకుని.. వారి వద్ద కిలోల కొద్దీ గంజాయిని స్వాదీనం చేసుకుని అరెస్టులు చూపారు. జైలుకు పంపారు. ఆ తర్వాత వారి కదలికలపై ఎందుకు నిఘా పెట్టడంలేదు. ఇదే ఇప్పుడు పోలీస్ నిఘా వ్యవస్థ విఫలమైందనే సర్వత్రా చర్చ సాగుతోంది.
శుక్రవారం అర్థరాత్రి దాటాక కూడా.. నెల్లూరును దాటి. వెంకటాచలం టోల్ప్లాజా మీదుగా ఓ కారులో గంజాయి పెద్ద ఎత్తున తరలిపోతోందన్న పక్కా సమాచారంతో రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిఘా పెట్టారు. అయినా.. వారిని ఢీకొట్టి మరీ గంజాయి స్మగ్లర్ వెళ్లిపోయాడు. ఈ ఘటనలో డీఎస్పీ తీవ్రంగా గాయపడ్డారు. బొల్లినేని ఆసుపత్రికి తరలించారు. ఆ స్మగ్లర్ అక్కడి నుంచి పారిపోతూ.. మనుబోలు మండలం దాటాక.. గూడూరు సమీపిస్తుండగా.. అక్కడ యూ టర్న్ తీసుకున్నారు. అక్కడ గూడూరు, కోట వాకాడు పోలీసులు కూడా కాపుకాచారు. అక్కడ ఓ సీఐ వాహనాన్ని అడ్డుపెడితే.. దాన్నీ స్వల్పంగా ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయాడు. ఆ ఘటనలో ఓ సీఐ కూడా గాయపడ్డారు. అక్కడి నుంచి .. పొదలకూరు మీదుగా సంగం.. అక్కడి నుంచి ఆత్మకూరును దాటుకుని.. మర్రిపాడు వైపు వెళ్తుండగా.. అప్పటికే సమాచారం అందుకున్న ఆత్మకూరు సీఐ గంగాధర్, సిబ్బంది ఆ స్మగ్లర్ కారును వెంబడించి.. అక్కడ అతడ్ని పట్టుకున్నారు. అతడి వాహనాన్ని తనిఖీ చేయగా.. పెద్ద ఎత్తున గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు సమాచారం. దాని విలువ కోట్లల్లో ఉంటుందంటున్నారు. ఈ క్రమంలోనే ఆత్మకూరు సీఐ కారు ఓ కల్వర్ట్ను ఢీకొట్టి.. కాలువలోకి వెళ్లిపోయింది. గంగాధర్ కూడా స్వల్పంగా గాయపడ్డారు. ఆ ఇద్దరు సీఐలతోపాటు.. డీఎస్పీలు చికిత్స పొందుతున్నారు. ఆ స్మగ్లర్ రాజమండ్రి.. రాజేంద్ర నగర్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇతడు పాత స్మగ్లర్గా, ఇప్పటికే అనేకసార్లు గంజాయి రవాణా చేసినట్లు గుర్తించారు. దీని వెనుక ఎవరున్నారు…? ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు. పట్టుబడ్డ గంజాయి ఎన్ని కిలోలు.. దాని విలువ ఎంత..? ఎవరెవరికి సరఫరా చేస్తున్నారు..? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఓ స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది.