అర్జీలను సకాలంలో పరిష్కరించాలి_ _అధికారుల్ని ఆదేశించిన కలెక్టర్ ఆనంద్_
పిజిఆర్ఎస్ కి భారీగా వినతులు
- అర్జీలను సకాలంలో పరిష్కరించాలి
- అధికారుల్ని ఆదేశించిన కలెక్టర్ ఆనంద్
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 555 అర్జీలను ప్రజలు అందచేశారని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. నిర్దిష్ట గడువులోగా అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు అందిస్తున్న అర్జీలను జాప్యం లేకుండా సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ ఆనంద్ ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్తో పాటు డిఆర్వో హుస్సేన్సాహెబ్, డ్వామా పీడీ గంగాభవాని, జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్రెడ్డి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను వెంటనే పరిష్కరించేందుకు ఆయాశాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి అర్జీని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలు సంతృప్తి చెందేలా నిర్దిష్ట గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపించాలని, పరిష్కరించలేని సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారో అర్జీదారులకు వివరించాలన్నారు. వేదిక కార్యక్రమానికి మొత్తం వివిధ శాఖలకు సంబంధించి 555 అర్జీలను ప్రజలు అందచేశారని కలెక్టర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.