కమిషనర్ వై.ఓ నందన్ – కార్పొరేషన్ కార్యాలయంలో అర్జీలు స్వీకరించిన కమిషనర్
విజయదశమి నాటికి లబ్ధిదారులకు గృహాలు అందజేస్తాం
- కమిషనర్ వై.ఓ నందన్
- కార్పొరేషన్ కార్యాలయంలో అర్జీలు స్వీకరించిన కమిషనర్
వివిధ కారణాలవల్ల లబ్ధిదారులకు కొన్ని గృహాలు మంజూరు కాలేదని, వాటి కోసం గతంలో చెల్లించిన మొత్తాలను తిరిగి లబ్ధిదారులకు అందిస్తామని కమిషనర్ నందన్ తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన అర్జీలు స్వీకరించారు.
టిడ్కో గృహాల నిర్మాణాలను వేగవంతంగా పూర్తిచేసి, విజయదశమి నాటికి బి,సి కేటగిరీల డబల్ బెడ్ రూమ్ గృహాలను లబ్ధిదారులకు అందించనున్నామని కమిషనర్ వై.ఓ నందన్ తెలియజేశారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను కమిషనర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కమిషనర్ మాట్లాడుతూ… గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయనున్నామని తెలిపారు. వివిధ కారణాలవల్ల లబ్ధిదారులకు కొన్ని గృహాలు మంజూరు కాలేదని, వాటికోసం గతంలో చెల్లించిన మొత్తాలను తిరిగి లబ్ధిదారులకు అందిస్తామని కమిషనర్ వెల్లడించారు. ఏ కేటగిరి విభాగంలో గృహాలు మంజూరైనప్పటికీ ఇప్పటివరకు స్వాధీనం చేసుకొని లబ్ధిదారులకు నోటీసులు అందజేస్తున్నామని, నోటీసులకు స్పందించని లబ్ధిదారులకు చెందిన గృహాలను ఇతర లబ్ధిదారులకు క్రమపద్ధతిలో కేటాయిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. మొత్తం 47 అర్జీలను అందుకున్నామన్నారు. నిర్దేశించిన సమయంలోపు సమస్యలన్నిటిని పరిష్కరించాలని విభాగాల ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, టౌన్ ప్లానింగ్ సిపి హిమబిందు, మేనేజర్ రాజేశ్వరి, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.