రైల్వే అండర్ పాస్ వంతెనలు ప్రధాన రోడ్లు, గ్రామీణ రోడ్లు ప్రదాన అజెండా – సస్యశ్యామలంగా వ్యవసాయానికి కావలి కాలువ, డీఆర్, డీఎం కాలువల ఆధునీకరణ – కావలి పట్టణ, నియోజకవర్గంలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాల కల్పన – ఏడాది తన పాలనాప్రగతిపై ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్
రూ. 270 కోట్లతో అభివృద్ధి…
రూ.370 కోట్లకు ప్రతిపాదనలు
- రైల్వే అండర్ పాస్ వంతెనలు ప్రధాన రోడ్లు, గ్రామీణ రోడ్లు ప్రదాన అజెండా
- సస్యశ్యామలంగా వ్యవసాయానికి కావలి కాలువ, డీఆర్, డీఎం కాలువల ఆధునీకరణ
- కావలి పట్టణ, నియోజకవర్గంలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాల కల్పన
- ఏడాది తన పాలనాప్రగతిపై ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్
సామాజిక సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చా, ఏడాదికి ముందువరకు తానూ సామాన్య కార్యకర్తనే, ఎన్నో అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నా… కావలి ప్రజలు నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారన్నారు. ఏడాది కాలంగా 24/7 కావలిలోనే సేవలు అందిస్తున్నా… నన్ను ఆదరించిన ప్రజలకు రక్షణగా ఉంటాననీ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. కావలి పట్టణం మనోహర్ రెడ్డి కళ్యాణ మండపంలో మంగళవారం తన ఏడాది పాలనాప్రగతిని, భవిష్యత్తులో తాను చేయబోయే అభివృద్ధి మంత్రంను రెండున్నర గంటలపాటు ఏకధాటిగా తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఏడాదిలో 270 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తుండగా, మరో 370 కోట్లకు ప్రతిపాదనలు పంపగా నిధులు మంజూరు కీలకదశలో ఉన్నట్లు తెలిపారు. దగదర్తి మండలం సున్నపుబట్టి నుంచి రుద్రకోట వరకు ఉన్న అన్నీ రైల్వే గేట్లు వద్ద అండర్ పాస్ వంతెనలు, ప్రధాన రోడ్లు, గ్రామీణ రోడ్లు నిర్మాణమే ప్రదాన అజెండా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. పెండింగ్ లో ఉన్న తుమ్మల పెంట, బుచ్చి రోడ్లు పూర్తి చేశామన్నారు. కావలి పట్టణం, నియోజకవర్గంలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు రోడ్లు, తాగునీటి పథకం పనులు జోరుగా జరుగుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా నియోజకవర్గంలో వ్యవసాయం సస్యశ్యామలం చేసేందుకు కావలి కాలువ, డీఆర్, డీఎం కాలువల ఆధునీకరణ చేసినట్లు చెప్పారు. పంటల ముంపుకు గురవుతూ రైతులు ఇబ్బంది పడుతున్నారని కొండేపి డ్రైన్ కాలువ నిర్మాణం కోసం 200 కోట్ల నిధులకు ప్రతిపాదనలు పంపామన్నారు.