వీడిన షఫీ హత్య కేసు మిస్టరీ – హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి
ఏడుగురు నిందితులు అరెస్ట్
వివరాలు వెల్లడించిన ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్
ప్రేమించిన అమ్మాయి దక్కదనే…
కక్షతోనే హత్య
- వీడిన షఫీ హత్య కేసు మిస్టరీ
- హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి
- ఏడుగురు నిందితులు అరెస్ట్
- వివరాలు వెల్లడించిన ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్
రాపూరులో జరిగిన కూలింగ్ షాప్ యజమాని షఫీ హత్య కేసుని పోలీసులు చేధించారని ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ తెలిపారు. ఈ మేరకు ఆయన రాపూరు సీఐ కార్యాలయంలో నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపరచి హత్య కేసు వివరాలను వెల్లడించారు.
ఈనెల 16 వ తేదీన రాపూరులో జరిగిన కూలింగ్ షాపు యజమాని షఫీ హత్య కేసును రాపూరు పోలీసులు చేధించారు. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా రాపూరు సర్కిల్ కార్యాలయంలో నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపరచి…కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వెల్లడించారు.
రాపూరుకి చెందిన సండ్రపల్లి మస్తాన్ మృతుడు షఫీ కుమార్తె ను ప్రేమించాడు. కానీ షఫీ కూతురికి బంధువులతో వివాహం నిశ్చయం అయ్యింది. దీనిని సహించలేని మస్తాన్ అడ్డుగా ఉన్న ఆమె తండ్రిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయమై గూడూరులో ఉండే తన స్నేహితుడు దాసరి క్రాంతితో మాట్లాడి హత్యకు పథకాన్ని రూపొందించాడు. దాసరి క్రాంతి ఈ హత్య పథకాన్ని అమలు చేయడం కోసం తన స్నేహితులు సుదర్శన్ సన్ని, మొగిలిగుంట్ల రాజశేఖర్, తలారి సాయి ప్రకాష్, మలపాటి వెంకట సాయి, అలపాకుల తరుణ్ ను తన వద్దకు రప్పించి హత్యా పథకాన్ని వివరించాడు. మలపాటి వెంకటసాయి ద్వారా బాడుగ కారును ఏర్పాటు చేయించి, దానికి నకిలీ నెంబర్ ప్లేటు తగిలించి, వారికి అవసరమైన ఖర్చులు సండ్రపల్లి మస్తాన్ ద్వారా సమకూర్చాడు. దాసరి క్రాంతి హత్య చేయడం కోసం తలారి సాయి ప్రకాష్ కొబ్బరికాయలు కొట్టే కత్తిని అప్పగించాడు. ఈనెల 16వతేదీ రాత్రి నకిలీ నెంబర్ ప్లేటుతో ఉన్న కారులో మృతుడి దుకాణం చుట్టూ రెక్కి నిర్వహించారు. కాపు కాసీ షఫీ దుకాణం మూసి వేసి ఇంటికి వెళుతున్న సమయంలో నిందితులు షఫీని ఆపి కారులో నుంచి ఒకరు షఫీతో మాట్లాడుతుండగా, వెనుక నుంచి మొగిలిగుంట్ల రాజశేఖర్ బలవంతంగా కారులోకి తోశాడు. అనంతరం కొట్టుకుంటూ తీసుకెళ్లి తాతిపల్లి గ్రామ శివార్లలో నిర్మానుష్య ప్రదేశంలో కిరాతకంగా హత్య చేశారు. అనంతరం నిందితులు కారులో అక్కడి నుంచి పరారయ్యారని డీఎస్పీ తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితులను జిల్లా జైలుకు రిమాండ్ కు పంపామని ఆయన చెప్పారు. సమావేశంలో రాపూర్ సిఐ సత్యనారాయణ, కండలేరు ఎస్సై రామకృష్ణ, రాపూర్ ఎస్సై వెంకట్ రాజేష్, సైదాపురం ఎస్ఐ క్రాంతి కుమార్ పాల్గొన్నారు. కేసును చేధించడంలో ప్రతిభ చూపిన పోలీసులు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.