అసలు సూత్రధారులను వదిలేసి విలేకరులపై ప్రతాపం
నేతలు బెయిలు తెచ్చుకునే వరకు అనధికారిక వెసులు బాటు
నేతల కోసం జబ్బలు చరిచిన విలేకరుల పరిస్థితి దారుణం
నేతల అరెస్ట్ లో మీనమేషాలు…
- అసలు సూత్రధారులను వదిలేసి విలేకరులపై ప్రతాపం
- నేతలు బెయిలు తెచ్చుకునే వరకు అనధికారిక వెసులు బాటు
- నేతల కోసం జబ్బలు చరిచిన విలేకరుల పరిస్థితి దారుణం
పైలాన్ ధ్వంసం కేసులో నేతల అరెస్టులో పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు సూత్రధారులను వదిలేసి విలేఖర్లపై ప్రతాపం చూపడం దారుణమని జర్నలిస్ట్ వర్గాలు వాపోతున్నాయి. అసలైన నిందితులను అరెస్ట్ చేసి భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తుంది.
నెల్లూరు జిల్లా కావలిలో అమృత్ పైలాన్ ధ్వంసం కేసులో పోలీసుల విచారణపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసులో నేతల పేర్లు ఉన్నా…. వారిని అరెస్ట్ చేయకుండా వారికి బెయిల్ వెసులుబాటు కల్పిస్తున్నారు. కానీ విలేకరులను ఆఘమేఘాల మీద అరెస్ట్ చేశారు. పైలాన్ ధ్వంసంలో అసలైన సూత్రధారులు ఎవరో అందరికీ తెలిసిందే. నాడు ఈ వ్యవహారంలో విలేకరులను పావులుగా చేశారు. ప్రెస్ క్లబ్, ఇళ్ల స్థలాలు ఆశచూపి ఈ దుచ్చర్యకు పాల్పడ్డారు. అరెస్ట్ అయిన నలుగురు విలేకరుల్లో ఇద్దరు ప్రమేయం లేదని, అయినా ఇరికించారని జర్నలిస్ట్ వర్గాలు వాపోతున్నాయి. కాకపోతే ఆ ఇద్దరు ఎన్నికల ముందు సోషల్ మీడియా వేదికగా నాటి ప్రతిపక్ష నేతలపై విలేకరుల పేరుతో పరిధిదాటి పోస్టులు పెట్టారు. నాడు పైలాన్ ధ్వంసం విషయంలో ఓ పోలీసు అధికారి పూర్తిగా సహకరించారు. ఆయనపై కేసు ఎందుకు నమోదు చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా పోలీసులు పైలాన్ ధ్వంసం కేసులో అటు నేతలైనా, విలేకరులైనా, సహకరించిన అధికారులైనా అసలైన నిందితులను అరెస్ట్ చేసి భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తుంది.