ప్రసవించిన కొద్ది నిమిషాలకే మృతి
సంబంధం లేదంటున్న ఆసుపత్రి నిర్వాహకులు
ఆండాళ్ ఆసుపత్రి వద్ద ఆందోళన.. ఉద్రిక్తత
నెల్లూరు నగరంలో దారుణం చోటుచేసుకుంది.. ప్రైవేటు వైద్యుల నిర్లక్ష్యం.. అలక్షంతో ఓ నిండు బాలింత కన్నుమూసింది.. తన భార్య మృతికి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని భర్త, మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగిన సంఘటన నెల్లూరు నగరంలోని పొగతోటలో ఉన్న ఆండాళ్ హాస్పిటల్ వద్ద కొద్ది సేపటిక్రితం చోటుచేసుకుంది. అల్లూరు మండలం.. దండిగుంటకు చెందిన ప్రసాద్ భార్య జ్యోత్స్న అనే మహిళ శనివారం రాత్రి ఆండాళ్ ఆసుపత్రి వద్దకు కాన్పుకు వచ్చింది. ఈరోజు మధ్యాహ్నాం జ్యోత్స్నకు ఆపరేషన్ చేసి.. కాన్పు చేశారు. పండంటి ఆడబిడ్డ పుట్టింది. కాన్పు అయిన కొద్ది నిమిషాలకే ఆమె అప్మారక స్థితిలోకి చేరుకుంది. ఉలుకు, పలుకు లేకుండా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆరా తీశారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది.. ఆమె కోమాలోకి వెళ్లింది.. కిమ్స్కు తరలించాలని.. అంబూలెన్స్లో అక్కడకు పంపారు. అక్కడి వైద్యులు పరీక్షించి.. అప్పటికే మృతిచెందినట్లు నిర్థారించారు. దాంతో వాళ్లంతా ఆండాళ్ ఆసుపత్రి వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. తమ బిడ్డకు సాధారణ నొప్పులు వస్తున్నప్పటికీ.. ఆపరేషన్ చేసి.. కాన్పు చేశారంటూ మండిపడ్డారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయిందంటూ.. ఆరోపించారు. భర్త ప్రసాద్, ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర వేదనతో ఉన్నారు. కదిలిస్తే.. కన్నీరుమున్నీరు అవుతున్నారు. తమ బిడ్డను ఆండాళ్ ఆసుపత్రి వాళ్లే చంపేశారంటూ.. రోధిస్తున్నారు. జ్యోత్స్నకు రెండేళ్లక్రితం ఇక్కడే.. సుఖ ప్రసవం అయ్యింది. ఈ\సారి ఆపరేషన్ చేయడంతోనే ఆమె చనిపోయిందంటూ ఆవేదన చెందుతున్నారు. ఆసుపత్రి వద్ద ఆందోళనగా ఉండటంతో.. చిన్నబజారు పోలీసు స్టేషన్ సీఐ చిట్టెం కోటేశ్వరరావు, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలిస్తున్నారు. ఆసుపత్రి నిర్వాహకులతో మాట్లాడుతున్నారు. ఆందోళనను శాంతింపజేసినా.. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదలబోమంటూ.. వారు భీష్మించుకున్నారు. ఇదిలా ఉంటే.. ఆసుపత్రి నిర్వాహకులు మాత్రం..ఆమె మృతితో సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తుండటంతో.. బాధితులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.