జగనన్న కాలనీ ఎదురుగా డంపింగ్యార్డ్ ఏర్పాటుపై తీవ్ర అభ్యంతరం
ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన కొన్నెంబట్టు గ్రామస్తులు
ఇక్కడ డంపింగ్ యార్డ్ వద్దు
- జగనన్న కాలనీ ఎదురుగా డంపింగ్యార్డ్ ఏర్పాటుపై తీవ్ర అభ్యంతరం
- ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన కొన్నెంబట్టు గ్రామస్తులు
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం జగనన్న కాలనీ ఎదురుగా, కొన్నెంబట్టు గ్రామానికి వెళ్లే మార్గంలో డంపింగ్ యార్డ్ను ఏర్పాటు చేస్తున్న మున్సిపాలిటీ చర్యపై గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పట్టణంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ వల్ల అనేక సమస్యలు ఎదురైందని, ఇప్పుడు అదే పరిస్థితిని మళ్లీ సృష్టిస్తున్నారని విమర్శిస్తున్నారు. జనావాసాల మధ్య డంపింగ్ యార్డ్ పెట్టడం సరికాదని గ్రామస్తులు మండిపడుతున్నారు. అధికారులు గ్రామాలకు దూర ప్రాంతాన్ని ఎంపిక చేయాలని, లేదంటే త్వరలో నిరసన కార్యక్రమాలు తీవ్ర స్థాయిలో చేపడతామని కొన్నెంబట్టు గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏ.ఐ.ఎస్.ఎఫ్ నాయకులు తేరే సూర్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య స్పందిస్తూ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం పట్టణంలోని డంపింగ్ యార్డులో మంటలు చెలరేగిన నేపథ్యంలో తాత్కాలికంగా జగనన్న కాలనీ ఎదురుగా ఉన్న ప్రదేశంలో చెత్తను డంప్ చేయాల్సి వస్తోందన్నారు. త్వరలో మరో ప్రాంతంలో నూతనంగా డంపింగ్ యార్డు ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. గ్రామస్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు.