పెన్నలో భారీగా అక్రమాలు
హిటాచీలతో టిప్పర్లకు ఇసుక లోడింగ్ చేస్తున్న అక్రమార్కులు
నుడా ఛైర్మన్ ప్రమేయంతో వెలుగులోకి
రెండు టిప్పర్లు, ఓ హిటాచీ స్వాదీనం చేసుకున్న పోలీసులు
భారీ యంత్రాలతో ఇసుక లోడింగ్..!
పెన్నలో భారీగా అక్రమాలు
హిటాచీలతో టిప్పర్లకు ఇసుక లోడింగ్ చేస్తున్న అక్రమార్కులు
నుడా ఛైర్మన్ ప్రమేయంతో వెలుగులోకి
రెండు టిప్పర్లు, ఓ హిటాచీ స్వాదీనం చేసుకున్న పోలీసులు
నెల్లూరు లోని దీన్ దయాళ్ నగర్ పెన్నా నదిలో కొంత కాలంగా గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా.. అడ్డదారిన ఇసుక రవాణా జరుగుతున్న వ్యవహారం గుట్టురట్టైంది. స్వయాన టీడీపీ నేత, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి రంగప్రవేశం చేయడంతో ఈ అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. ఈసందర్భంగా పెన్నలో ఇసుక తరలిస్తున్న టిప్పర్ల డ్రైవర్లు చెప్పిన వివరాలు, అక్కడ కనిపించిన దృశ్యాలను చూస్తుంటే.. అనేక నెలలుగా ఈ యవ్వారం నడుస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో అక్రమాలపై కొందరు టీడీపీ నేతలపైనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్వయాన మంత్రి నారాయణ సైతం సమీక్ష పెట్టారు. నేతలు, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ విషయంలో టీడీపీకి చెందిన నాయకులుగాని, వారి కుటుంబ సభ్యులకుగాని ఎలాంటి సంబంధం లేదని.. కొందరు ఇసుక మాఫియా.. అక్రమంగా మిషన్లు పెట్టి.. ఇసుక తరలిస్తున్నట్లు నిర్థారించారు. ఇసుక పట్టించిన వారికి మంత్రి నారాయణ లక్ష రూపాయిలు బహుమతికూడా ప్రకటించారు. ఆ సమయంలో ఎక్కడి దొంగలు అక్కడ గప్చుప్ అయ్యారు. టీడీపీ నేతలు, యువనేతలు కూడా ఈ వ్యవహారంలో తలదూర్చలేదు. అయితే.. గత కొద్ది నెలలుగా మళ్లీ ఇసుక మాఫియా రెచ్చిపోతోందని తెలుస్తోంది. హిటాచీలను నేరుగా పెన్నానదిలోకి దింపేసి.. రోజుకు 15 నుంచి 30కిపైగా టిప్పర్లతో ఇసుక తరలిస్తూ.. దోచుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. నిన్న రాత్రి కోటంరెడ్డితోపాటు తెలుగుదేశం నాయకులు పెన్నలో పరిశీలిస్తే.. అక్కడ లోడేసిన దృశ్యాలతోపాటు భారీ యంత్రాలు కనిపించడంతో నిజమేననిపిస్తోంది. రాత్రికి రాత్రే కోటంరెడ్డి పట్టించిన రెండు టిప్పర్లు, ఓ హిటాచీ యంత్రాన్ని రూరల్ సీఐ వేణు స్వదీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. రూరల్ తహసీల్దారు లాజరస్ సమక్షంలో ఈ సంఘటనకు సంబంధించిన పంచనామా రాశారు. ఇకనైనా అధికారులు, పోలీసులు అప్పుడప్పుడు ఇటువైపు ఓ కన్నేస్తే.. అక్రమాలు జరక్కుండా ఉంటాయని స్థానికులు కోరుతున్నారు.