సంక్షిప్త వార్త మాలిక
బుచ్చిరెడ్డిపాళెం మండలం కొట్టాలు గ్రామంలో ఆటో నగర్ నిర్మాణానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి భూమి పూజ చేశారు. మరో రెండు నెలల్లో ఆటో నగర్ ని పూర్తి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఆటో యూనియన్ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
సంగం మండలం దువ్వూరు గ్రామంలోని బస్టాండ్ సెంటర్ లో పంచాయతీ కార్యదర్శి హమీద్ చలివేంద్రం ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని ఎంపీడీవో షాలెట్, టీడీపీ నేతలతో కలిసి ఆయన ప్రారంభించారు.
కావలి పట్టణం వైకుంఠపురంలో జనసేన నాయకులు చలివేంద్రం ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ కావలి అధికార ప్రతినిధి మన్నేపల్లి రిషికేష్ జన్మదినం సందర్భంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని జనసేన నేతలు తెలిపారు.
టీడీపీ నేతలపై….నాయుడుపేట వైసీపీ టౌన్ ప్రెసిడెంట్ కలికి మాధవరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
డక్కిలి మండలం దేవునివెల్లంపల్లిలో శ్రీ స్తంభాలగిరి ఈశ్వరయ్యస్వామి తిరునాళ్ల మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆయన సతీమణి పాల్గొని శివపార్వతులకి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వింజమూరు మండలం కాటేపల్లి పంచాయతీలోని గ్రామకంఠ భూములను కొందరు ఆక్రమించారని గ్రామస్థులు ఆరోపించారు. ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు తహసీల్దార్ కు వినతి పత్రం అందచేశారు.
కోటలోని ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ పథకం ప్రజావేదిక సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని తిరుపతి పీడీ శ్రీనివాస ప్రసాద్ నిర్వహించారు. ఉపాధి పనుల్లో అవకతవకలు జరిగాయని కూలీలు ఆయన ఫిర్యాదు చేశారు. వారం రోజుల్లో చర్యలు తీసుకుంటామని పీడీ గ్రామస్థులకి హామీ ఇచ్చారు.
విడవలూరు మండలం దంపూరు గ్రామంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలకరించి పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు.
సంగం మండలం దువ్వూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఇన్ఫినిటీ ఫిన్ కాప్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకులు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. నిర్వాహకులకి ఉపాధ్యాయులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు.