ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం
నెల్లూరులో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన.
రూ. 1కే భూగర్భ డ్రైనేజీ కనెక్షన్
- ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం
- నెల్లూరులో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన
ప్రజల అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని… భూగర్భ డ్రైనేజీ అందుబాటులో ఉన్న పట్టణాల్లో కనెక్షన్ ను కేవలం ఒక రూపాయికే అందించనున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో ఆయన సుడిగాలి పర్యటన జరిపారు. ఎన్టీఆర్ నగర్, ఏసీ నగర్, ఆదిత్యా నగర్, జగదీష్ నగర్ తదితర ప్రాంతాల్లోని పార్కుల్లో ఏర్పాటు చేస్తున్న జిమ్ ఎక్విప్మెంట్, వాకింగ్ ట్రాక్స్ తదితర పనుల పురోగతిని మంత్రి స్వయంగా పరిశీలించారు. ఆటస్థలాలు అనువుగా ఉన్న పాఠశాలల్లో బాస్కెట్బాల్, వాలీబాల్ కోర్టులను ఏర్పాటు చేయవలసిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా నారాయణ మీడియాతో మాట్లాడుతూ… గతంలో తాము అధికారంలో ఉన్న 2014-19 లో రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో పార్కులను, సెంట్రల్ లైటింగ్ సిస్టం ను అభివృద్ధి చేశామన్నారు. అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వ నిర్వహణ లోపాలతో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. దోమలు లేని నగరంగా తీర్చిదిద్దాలంటే భూగర్భ డ్రైనేజీ ఏర్పాటుతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట మున్సిపల్ కమిషనర్ సూర్య తేజ, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పిటిసి విజేత రెడ్డి, టిడిపి నగర ఇంచార్జ్ మామిడాల మధు, ఇతర అధికారులు, స్థానిక కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.