ఏపీ వక్ఫ్ బోర్డ్ ఆస్తుల్ని పరిశీలించిన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్ధుల్ అజీజ్
భాగ్యనగరంలో అబ్దుల్ అజీజ్…
- ఏపీ వక్ఫ్ బోర్డ్ ఆస్తుల్ని పరిశీలించిన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్ధుల్ అజీజ్
హైదరాబాద్ నగరంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్ధుల్ అజీజ్ సుడిగాలి పర్యటన చేశారు. నగరంలోని బీకే గూడా, ఎస్సార్ నగర్, హిమాయత్ నగర్ లలో గల కర్నూల్ అంజుమన్ – ఏ – ఇస్లామియా కు సంబంధించిన వక్ఫ్ ఆస్తులను అజీజ్ పరిశీలించారు. బి.కె గూడా నందు గల 3.40 ఎకరాల వక్ఫ్ భూమిని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, రాగ్ పికర్స్ వారు ఆక్రమించారని ఆయన తెలిపారు. ఆక్రమణకు గురైన వక్ఫ్ భూమిని ఆయన పరిశీలించారు. పరిశీలన అనంతరం ఆయన మాట్లాడుతూ… హైదరాబాద్ లో ఏపీ వక్ఫ్ బోర్డ్ కు చెందిన స్థలంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డంపింగ్ యార్డ్ నిర్వహిస్తుందని తెలిపారు. దీనిపై జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి త్వరితగతిన ఇక్కడి నుండి డంపింగ్ యార్డ్ ను తరలిస్తామని పేర్కొన్నారు. అలాగే హిమాయత్ నగర్ లో గల పాత షాపింగ్ కాంప్లెక్స్ లను నూతనంగా అభివృద్ధిపరిచి సర్వాంగ సుందరంగా తయారు చేస్తామని తద్వారా వక్ఫ్ బోర్డ్ కు ఆదాయాన్ని పెంచుతామని స్పష్టం చేశారు. వీటికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలను తక్షణమే ప్రారంభించి అందుకు అనుగుణంగా బృహత్తర ప్రణాళిక రూపొందించాలని వక్ఫ్ బోర్డ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అబ్దుల్ ఖాదీర్ కు అబ్దుల్ అజీజ్ సూచించారు.