పార్కుల అభివృద్ధికి నిధులు
మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు
4,44,49 డివిజన్లలో పార్కులను పరిశీలించిన మంత్రి నారాయణ
నెల్లూరు నగరంలోని పార్కులను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నామని.. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈమేరకు ఆయన ఆదివారం సాయంత్రం నెల్లూరు నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. డిప్యూటీ మేయర్ రూపుకుమార్ యాదవ్, మాజీ జెడ్పిటిసి విజేత రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, నగర అధ్యక్షుడు మామిడాల మధు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వేమిరెడ్డీ విజయ భాస్కర్ రెడ్డి, పిట్టి సత్య నాగేశ్వర రావు, కప్పిర శ్రీనివాసులు, కప్పిర రేవతి, రంగన్న ముఖ్య నాయకులు, నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ నందన్, పలువురు ఉన్నతాధికారులతో కలిసి 4, 44, 49 శ్రీరామ్నగర్ పార్కు, మహబూబ్ఖాన్ పార్కుతోపాటు గుంటబడిలో జిమ్ పరికరాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. నెల్లూరు నగరాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని.. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలను అభివృద్ధి చేయడమే ఎజెండా పనిచేస్తున్నామన్నారు. నగరంలోని పార్కుల అభివృద్ధి చేయడం జరుగుతుందని.. అందులో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పిల్లలు, పెద్దలకు వేరువేరుగా ప్లే, జిమ్ పరికరాలు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే.. అన్ని పాఠశాలలో ఆట స్థలాలను సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. గత ఐదేళ్లలో వైసిపి ప్రభుత్వం వాటి ఆలనా పాలన పట్టించుకోకపోవడంతో వ్యాయామ పరికరాలు తుప్పు పట్టి మూలనపడ్డాయన్నారు. వైసిపి ప్రభుత్వం మున్సిపాలిటీకి ప్రజలు చెల్లిస్తున్న పన్నులను దారి మళ్ళించి మున్సిపల్ పార్కులను నాశనం చేసిందని తెలిపారు. మరో మూడు నెలల్లో.. నెల్లూరులోని అన్ని పార్కుల్లో జిమ్ ఎక్విప్మెంట్.. ప్లే ఎక్విప్మెంట్ ను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామని ఈసందర్భంగా నారాయణ పేర్కొన్నారు. అలాగే.. త్వరలో నెల్లూరు నగరంలో.. హట్కోనిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంను తిరిగి ప్రారంభించి.. పూర్తి చేస్తామన్నారు. సంతపేట గుంట బడిలో మూడున్నర ఎకరాల క్రీడా మైదానం చెత్తాచెదారాలతో నిండి ఆసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందని.. గ్రౌండ్లో చెత్తను తొలగించి, క్రికెట్ వాలీబాల్, హాకీ తదితర క్రీడలు ఆడుకునేందుకు వీలుగా గ్రౌండ్ను సిద్ధం చేస్తున్నామన్నారు. మార్నింగ్ వాక్ కోసం ట్రాక్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసినట్లు ఈసందర్భంగా మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ ఇన్ఛార్జులు తదితరులు పాల్గొన్నారు.