ఊపిరి పీల్చుకున్న ప్రజలు, దుకాణదారులు
అయినా కొనసాగుతున్న కర్ఫ్యూ…?
గత ఐదు రోజులుగా పోలీసుల పహారాలో ఉన్న…ములుముడి బస్టాండ్ సమీపంలోని ఆజాద్ సెంటర్ గేట్లు ఎట్టకేలకు గురువారం తెరుచుకున్నాయి. దీంతో ప్రజలు, చిరు వ్యాపారస్తులు, రోడ్డ్ మార్జిన వ్యాపారస్తులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. అయినా ఆ ప్రాంతంలో పోలీసులు బందోబస్తు యధావిధిగానే కొనసాగుతోంది.
నెల్లూరు నగరం ములుముడి బస్టాండ్ సమీపంలోని ఆజాద్ సెంటర్లో…స్వామి వివేకానంద విగ్రహం ఏర్పాటుతో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గత ఐదు రోజులు నుంచి ఆజాద్ సర్కిల్ చుట్టూ పక్కల వందల మీటర్ల వరకు దుకాణాలన్నింటిని మూయించి వేశారు. ములుముడి బస్టాండు నుంచి చిన్నబజారు వైపు, అర్చన హాలు వైపు, గుంటబడి వైపు, మసీదు వైపు ఇలా ఐదు మార్గాలను పోలీసులు మూసేసి బారికేడ్లు పెట్టేశారు. ఆ మార్గాల ద్వారా వాహనాలతోపాటు…ప్రజలు సైతం రాకుండా పోలీసులు కాపలా కాశారు. ఈ క్రమంలో చిరు వ్యాపారస్తులు, రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులు తమ దుకాణాలను మూసి వేయడంతో తామంతా ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు…గురువారం ఆజాద్ సెంటర్లో ఏర్పాటు చేసిన బారికేడ్లను పోలీసులు తొలగించారు. దుకాణదారులు తమ తమ దుకాణాలను ఓపెన్ చేసుకున్నారు. అయినా…ఆజాద్ సెంటర్లో మాత్రం పోలీసు బందోబస్తు యధావిధిగానే కొనసాగుతోంది.