పలు అపార్టుమెంట్లలో చోరీ
సీసీ ఫుటేజీల్లో కనిపించిన దొంగలు
ఈ గ్యాంగే.. వరుస చోరీలు -భయాందోళనకు గురవుతున్న నగర ప్రజలు
నెల్లూరులో బీహారీ గ్యాంగ్ దిగిందా..?
ఎవరూ లేని ఇళ్లను టార్గెట్ చేశారా..?
అందరూ ఉన్నా.. దొరికినంత దోచేసేందుకు పథకం వేసిందా..?
పోలీసులు ఏం చేస్తున్నారు..? నిఘా పోలీసులకు కూడా వారి కదలికలు అంతుచిక్కడంలేదా..?
బీహారీ గ్యాంగ్ అంటేనే హడల్. వారు దోపిడీలు, చోరీలు చేయాలని నిర్ణయించినా.. టార్గెట్ చేసినా.. అస్సలు వదలరు. అనుకున్నట్లే దోచేస్తారు. ఎవరైనా అడ్డొస్తే.. చిన్న, పెద్ద అని తేడా లేకుండా శాల్తీ లేపేస్తారు. అంత చరిత్ర ఉంది. వారు ఏదైనా ప్రాంతంపై గురి పెట్టారంటే.. దొరికినంత దోచుకెళ్లకుండా అక్కడి నుంచి వెళ్లరు. ఇప్పుడు ఆ బీహారీ గ్యాంగ్ నెల్లూరుపై దృష్టిపెట్టినట్లుంది. ఏ క్లూ దొరక్కుండా.. నెల్లూరులో దిగినట్లుంది. సాధారణ, కరుడుగట్టిన దొంగల మాదిరికాదు వారు. ఇళ్లకు తాళాలు వేసి ఉంటేనే చోరీ చేసే ముఠా కాదది.. ఎవరూ లేని ప్రాంతాల్లో ఉన్న ఇళ్లను మాత్రమే లక్ష్యంగా చేసుకునే దొంగలు అంతకన్నా కాదు వారు. అందరూ ఉన్న చోటే చోరీలకు పాల్పడతారు.
ఇదే తరహాలో ఆదివారం అర్థరాత్రి దాటాక.. నెల్లూరు నగరంలో రెండు ప్రాంతాల్లో.. ఒకే సమయంలో అపార్టుమెంట్లలో చోరీలకు పాల్పడ్డారంటే.. వారి ధైర్యం.. తెగింపు.. వారు తచ్చాడుతున్న తీరు చూస్తుంటే.. నెల్లూరులో బీహారీ గ్యాంగ్ తిష్టవేసిందనే పోలీసులు అంటున్నారు. నెల్లూరు నగరం.. హరనాథపురం మూడో వీధిలోని గురు నిలయం అపార్టుమెంట్తోపాటు గోమతి నగర్లోని గోమతి స్కూల్ సమీపంలోని బాలాజీ హైట్ అపార్టుమెంట్ మొదటి అంతస్తు.. 103 ప్లాట్లో జొరబడి ఇంట్లో దాచిన 250 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేసి వెళ్లారు. హర్నాథపురంలోని గురునిలయం లోనూ పెద్ద ఎత్తున చోరీ జరిగినట్లు తెలుస్తోంది. ఈ గ్యాంగే.. రెండు చోట్లా చోరీకి పాల్పడ్డట్టు సీసీ ఫుటేజీల ఆధారంగా తెలుస్తోంది. వీరు నెల్లూరుకు చెందిన పాత నేరస్తులా..? లేక ఇంకెవరైనా ఈ చోరీలకు పాల్పడి ఉంటారా..? అని పోలీసులు లోతుగా పరిశీలిస్తున్నారు. అయితే.. ఈ తరహా చోరీలకు పాల్పడేది బీహారీ గ్యాంగేనని.. ఆ గ్యాంగ్ వచ్చినట్లుం పోలీసులే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో.. తస్మాత్ జాగ్రత్త