కావలి పట్టణం మద్దూరుపాడులో పెనుశిల గ్రీన్ సిటి లే అవుట్ లో అక్రమ లీలలు
లే అవుట్ కు రూ.25 లక్షల ప్రజాధనంతో రోడ్డు విస్తరణ
లే అవుట్ కు రూ. కోట్ల రూపాయల గ్రావెల్. ప్రభుత్వ ఆదాయానికి గండి
మాజీ ప్రజా ప్రతినిధి బినామీ లే అవుట్ గా ప్రాచుర్యం. అందుకే అధికార దుర్వినియోగం.
పక్కా ఆధారాలతో N3 న్యూస్ మీ ముందుకు – మద్దూరుపాడులో అక్రమ లే అవుట్లు ఎన్ త్రీ న్యూస్ పార్ట్ – 1
అవినీతికి అధికారం తోడైతే చేసే అక్రమాలకు అంతేలేదని నిరూపించారు గత వైసిపి పాలకులు. గత ఐదేళ్లలో వెలసిన అక్రమ లే అవుట్ లలో ఈ పరిస్థితి కానొస్తుంది. నాడు ఇదేంటని ప్రశ్నించిన వారికి బెదిరింపులు, దాడులు, అక్రమ కేసులు రుచి చూపించి భయభ్రాంతులను చేశారు. ఇక అధికార యంత్రాంగం వారి పాపాల్లో పాలు పంచుకున్నారు. కళ్ళు లేని కబోది పక్షుల్లా వ్యవహరించారు. జీతం, గీతం వస్తుండడంతో అక్రమాలకు జూ హుజూరు అంటూ చేతులెత్తేశారు. ఇలాంటి పాపాల్లో కావలి పట్టణం మద్దూరుపాడులో వేసిన రెండు లే ఔట్లు ఉన్నాయి. నాడు ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ నాయకులు అక్రమ లే అవుట్ల అంతు చూస్తామని, అక్రమాలకు పాల్పడిన ఏ అధికారిని వదిలిపెట్టమని బీరాలు పలికారు..తొడలు కొట్టారు. కావలికి వచ్చిన నారా లోకేష్ రెడ్ బుక్ లోనూ పేర్లు ఎక్కించారు. అధికారంలోకి వచ్చాక అందరూ సైలెంట్ అయ్యారు. అప్పుడప్పుడు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పై నాడు చెప్పిన డైలాగ్ లే చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు. మద్దూరుపాడులో లే అవుట్లు వేసింది ఎవరు..? అక్కడ జరిగిన అక్రమాలు ఏమిటి…? అధికారులు ఏం చేశారు…? తెలుసుకోవాలంటే.. N3 న్యూస్ చూడాల్సిందే…!
నెల్లూరు జిల్లా కావలి పట్టణం ఒకటో వార్డు మద్దూరుపాడులో వేసిన రెండు లే అవుట్లు పక్కా అక్రమాలకు ఆనవాళ్లుగా ఉన్నాయి. అందులో ఒకటి జాతీయ రహదారికి పడమర వైపు ఎస్సీ కాలనీని ఆనుకుని సుమారు 20 ఎకరాల్లో భారీ లే ఔట్ వేశారు. ఈ లే ఔట్ మాజీ ప్రజా ప్రతినిధి బినామీ లే అవుట్ అని అందరి తెలిసిన బహిరంగ సత్యం. నాడు ఈ లే ఔట్ నిర్మాణంలో అధికారం అండతో ఎన్నో నిబంధనలను తుంగలో తొక్కేశారు. దౌర్జన్యాలు చేశారు. అక్రమంగా గ్రావెల్ తరలించుకున్నారు. లే అవుట్ కోసం ప్రజాధనంతో రోడ్డు విస్తరణ చేయించారు. రైతులను అధిక ధరతో మభ్యపెట్టి, మరికొందరి బెదిరించి, భూమి ఇవ్వని రైతుల పొలం చుట్టూ దౌర్జన్యంతో అడ్డగోలుగా ప్రహరీ గోడ కట్టేసి పొలాలు సేకరించారు. మొత్తం మీద 204, 208, 209, 211, 212 సర్వేనంబర్లలో సుమారు 20 ఎకరాల్లో పెనుశిల గ్రీన్ సిటి పేరుతో లే అవుట్ ను నిర్మించారు. ఇందుకు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి జేబులో మనిషిలా పనిచేసిన నాటి ఆర్డీవో శీనా నాయక్ లాండ్ కన్వర్షన్ ఎన్వోసీ అడ్డగోలుగా ఇచ్చేశారు. 212 సర్వే నంబర్ లో డొంక పొరంబోకు భూమిని కలిపేసినా, 208 సర్వే నంబర్ లో వరవ కాలువను బారుకు ఆక్రమించినా నాడు ఆర్డీవోకు కానరాలేదు. ఈ లే ఔట్ కు ప్రభుత్వానికి రూపాయి సీనరేజ్ రుసుం చెల్లించకుండా రూ. కోట్ల విలువ చేసే గ్రావెల్ తోలి చదును చేసినా పట్టించుకోలేదు. ఈ లే అవుట్ కు పడమర వైపు 30 ఇళ్లతో ఎస్సీ కాలనీ ఉంది. 2018లో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో కాలనీ వరకు తారు రోడ్డు నిర్మించారు. ఈ పెనుశిల గ్రీన్ సిటి లే అవుట్ కు 35 అడుగుల రోడ్డు చూపించేందుకు గతంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో వేసిన తారు రోడ్డుకు సుమారు రూ.25 లక్షల ప్రజాధనం మున్సిపల్ నిధులతో రోడ్డు విస్తరణ చేశారు. రోడ్డు విస్తరణలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అధికారులపై ఒత్తిడి చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ లే ఔట్ కు విశాలపైన రోడ్డు అంటూ ప్రచారం చేసుకుని ప్లాట్లు అమ్ముకున్నారు. రోడ్డు విస్తరణలో ఈ లే ఔట్ కు ఉత్తరంగా పేదలకు జగనన్న కాలనీ నిర్మించారు. ఇక్కడకు వెళ్లేందుకు రోడ్డు లేదు. ఇదే నిధులతో జగనన్న కాలనీకి రోడ్డు నిర్మించవచ్చుకదా అనే విమర్శలు నాడు వచ్చినా పట్టించుకోలేదు. ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ అక్రమాలు జరుగుతుంటే ఎవరూ నోరుమెదపలేదు. ప్రభుత్వ ఆదాయానికి గండి పెడుతున్నా పట్టించుకోలేదు. ఈ లే అవుట్ కు అనుమతులు లేవని ప్రస్తుత అధికారులు ప్లాట్ల రాళ్లు తొలగించారు. కానీ ఇక్కడ నిర్మిస్తున్న ఇళ్ళకు అనుమతులు ఎలా వచ్చాయి..? ఈ నిర్మాణాలను ఎందుకు అడ్డు కోవడంలేదో ఎవరికి అర్థంకాని ప్రశ్న. లే అవుట్ యజమానుల నుంచి డబ్బులు గుంజుకునేందుకే ఈ బెదిరింపులు అన్న ఆరోపణలు వినొస్తున్నాయి. డొంక, వరవ కాలువ ఆక్రమణకు గురైనా అధికారులు ఏమి తెలియనట్లు నిద్ర నటిస్తున్నారు. అసలు ఈ లే ఔట్ కు గ్రావెల్ ఎక్కడ నుంచి వచ్చిందనేది విచారణ చేయడం లేదు. లే అవుట్ కోసం వేసిన గ్రావెల్ లెక్కించి వారి నుంచి ఎందుకు అపరాధ రుసుం వసూలు చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ప్రస్తుత పాలకుల నుంచి, అధికారుల నుంచి ఉండవు. ఇక మద్దూరుపాడులో వేసిన మరో అక్రమ లే అవుట్ పై N3 మరో కథనంతో త్వరలో మీ ముందుకు.. వెయిట్ అండ్ సీ….