- గార్బేజ్ పాయింట్లు ఏర్పడకుండా పర్యవేక్షించండి
- అధికారులు, సిబ్బందిని ఆదేశించిన కమిషనర్ సూర్యతేజ
- 2 డివిజన్ లో పర్యటించిన కమిషనర్
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలు వేయకుండా, గార్బేజ్ పాయింట్లు ఏర్పడకుండా పర్యవేక్షించాలని, ప్రణాళికా బద్ధంగా ఇంటింటి నుంచి చెత్త సేకరణ జరపాలని కమిషనర్ సూర్య తేజ ఆదేశించారు. నెల్లూరు నగరం 2 వ డివిజన్ పరిధిలోని 4 సచివాలయాలకు సంబంధించిన సిరి గార్డెన్, నరుకూరు, ఎస్. ఎల్. వి. రాయల్ ఎస్టేట్ తదితర ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా కమిషనర్ సోమవారం పర్యటించారు.
నగరపాలక సంస్థకు చెందిన స్థలాల్లో పార్కుల నిర్మాణం కోసం జంగిల్ క్లియరెన్స్ చేయించాలని ఆదేశించారు. గుడిపల్లిపాడు ప్రాంతంలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నుంచి స్థానికులందరికీ తాగునీటి కుళాయి కనెక్షన్లు వేగవంతం చేయాలని సూచించారు. నరుకూరు సమీపంలో అనధికార భవనం నిర్మాణం చేస్తుండటాన్ని గమనించిన కమిషనర్ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు స్థానిక వార్డు సచివాలయ ప్లానింగ్ సెక్రటరీకి షోకాజు నోటీసు జారీ చేయమని ఆదేశించారు.