-కలెక్టరేట్లో పురుగుల మందు తాగబోయిన ఓ రైతు
-అడ్డుకున్న కలెక్టర్, అధికారులు
-పట్టాదారు పాస్పుస్తకాలు ఇవ్వడంలేదంటూ ఆదేదన వ్యక్తం చేసిన రైతు
-సత్వర న్యాయం చేసేలా కలెక్టర్ ఆనంద్ నిర్ణయం
తన పొలంకు సంబంధించిన పాస్పుస్తకాలు ఇవ్వడంలేదని.. అడిగితే.. నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారంటూ.. మనస్థాపానికి గురైన ఓ రైతు కలెక్టరేట్ వద్కదకు పురుగుల మందుతో వచ్చి.. న్యాయం జరక్కపోతే ఆత్మహత్యకు పాల్పడతానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పొదలకూరు మండలం.. బిరదవోలుకు చెందిన మోడిబోయిన వెంకటరమణయ్య అనే రైతుకు 20.32 ఎకరాల పొలం పిత్రాజితంగా సంక్రమించింది. 2015కు ముందు ఆ పొలానికి సంబంధించి ఆన్లైన్లోఓ వేరే వాళ్ల నంబర్కి మారింది. దీన్ని ఉద్దేశపూర్వకంగానే అప్పటి తహసీల్దారు మార్చినట్లు ఆయన ఆరోపిస్తున్నారు. అప్పటి నుంచి ఈ తన పొలానికి నంబరు మార్చి.. పాస్ పుస్తకాలు మంజూరు చేయాలంటూ.. అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినా.. ఎవరూ పట్టించుకోలేదు. అనేకసార్లు కలెక్టరేట్లోనూ ఫిర్యాదు చేశారు. అయినా.. ఎవరూ ఆయనకు పరిష్కారం చూపలేదు. దాంతో మనస్థాపానికి గురైన బాధితుడు వెంకటరమణయ్య ఈ సోమవారం మరోసారి కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్కు వచ్చారు.
అనంతరం తనకు ఎక్కడా న్యాయం జరగడంలేదని.. న్యాయం చేయకపోతే చావే శరణ్యం అంటూ.. ఆయన తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బాను ఓపెన్చేసి తాగబోయాడు. దాంతో స్పందించిన కలెక్టర్.. వెంటనే ఆ పురుగుల మందు ను లాగి పడేసి.. అక్కడే ఉన్న పోలీసులు, ఇతర అధికారులతో ఆయన్ను సముదాయించారు. కలెక్టర్ ఆనంద్ స్వయంగా ఆయన్ను తన వద్ద కూర్చోబెట్టి.. జరిగిన విషయం అంతా తెలుసుకున్నారు. ఆయనకు తక్షణ న్యాయం చేసేలా చర్యలు తీసుకున్నారు. పొదలకూరు రెవెన్యూ అధికారులందర్నీ సాయంత్రం తనను కలవాలని ఈసందర్భంగా ఆదేశించారు. తప్పకుండా న్యాయం చేస్తానని కలెక్టర్ ఆ పెద్దాయనకు భరోసా ఇవ్వడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు.