- రాజ్యసభలో అడుగుపెట్టిన బీద మస్తాన్ రావు. రెండోసారి ప్రమాణ స్వీకారం
- టీడీపీ మద్దతుతో రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక
- మాజీ రాజ్యసభ్యునిగా 107 రోజులు కొనసాగిన బీద
నెల్లూరు జిల్లా వాసి, పారిశ్రామిక వేత్త, డాక్టర్ బీద మస్తాన్ రావు ఢిల్లీలోని పెద్దల సభలో రాజ్యసభ సభ్యునిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఉదయం రాజ్యసభ ప్రారంభంకాగానే చైర్మన్ జగదీప్ దినకర్ బీద మస్తాన్ రావు చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 2022 జులై 18 వ తేదీన అప్పటి వైసిపి మద్దతుతో ఆయన తొలిసారిగా రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2024 ఎన్నికల తర్వాత ఆయనను రాష్ట్రంలోని కూటమి పెద్దలు తిరిగి టీడీపిలోకి ఆహ్వానించారు. దీంతో ఆయన టీడీపీలో చేరి, ఈ ఏడాది ఆగస్టు 29 వ తేదీన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తిరిగి ఆయనను టీడీపి, జనసేన, బీజేపీ కూటమి మద్దతుతో టీడీపి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజ్యసభకు తిరిగి ఎంపిక చేశారు.
దీంతో ఈనెల 9వ తేదీన నామినేషన్ వేసిన బీద మస్తాన్ రావు, 14వ తేదీన రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. మళ్ళీ ఆయన బీద మస్తాన్ రావు అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చేయడం పట్ల ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మధ్యలో ఆయన రాజీనామా చేయడం తిరిగి ఎన్నికయ్యే వరకు అంటే 107 రోజులు మాజీ రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు.