- పైకిలేవని రాళ్లపాడు జలాశయం కుడికాలువ స్ట్రక్ అయిన తూము గేటు
- గేటుకు రంధ్రంపెట్టి పైప్ ద్వారా నీటిని బయటకు పంపేలా చర్యలు
- తూము గేటు ను పరిశీలించిన ప్రాజెక్ట్ ఎస్ఈ, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం
- మరో పక్క నీళ్లు లేక పంటలు ఎండి పోతున్నాయని రైతుల ఆవేదన
రాళ్పపాడు జలాశయంలో ఒకపక్క పుష్కలంగా సాగునీరు ఉంది. మరోపక్క వేల ఎకరాల్లో సాగు చేసిన పంటలకు నీళ్లు లేక ఎండిపోతున్నాయి, సాగు సిద్దం చేసుకున్న పొలాలకు అదునుదాటిపోతుందన్న ఆందోళనతో రైతులు మదన పడిపోతున్నారు. కానీ గత 15 రోజులుగా సాగునీరు విడుదల చేసేందుకు తూము గేటు తెరుచుకోవడం లేదు. గేటును ఈ రోజు తెరుస్తాం, ఇదిగో అదిగో అంటూ అధికార యంత్రాంగం నానా హడావిడి చేసినా ప్రయోజనం శూన్యం. చివరకు అధికారులు చేతులెత్తేయడంతో ఆదివారం రైతులు తీవ్ర స్థాయిలో ధర్నాకు దిగారు. తామేమి చేయలేమని తీరులో అధికారులు ఉన్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తూము షట్టర్ కు రంధ్రం వేసి పైపుల ద్వారా నీటిని బయటకు పంపేలా నిర్ణయం చేశారు.
దీంతో సోమవారం రైతులు పెద్ద సంఖ్యలో జలాశయం కుడి కాలువ తూము వద్దకు చేరుకున్నారు. కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, ప్రాజెక్ట్ ఎస్ ఈ అక్కడకు చేరుకుని పరిశీలించారు. తూము షట్టర్ వద్ద డ్రిల్లింగ్ మిషన్ తో తుముకు గేటుకు రంధ్రం పెట్టే పనులను అడిగి తెలుసుకున్నారు. కానీ అక్కడకు తెచ్చిన పైపులను చూసి రైతులు అభ్యంతం తెలిపారు. ఈ పైపులు చాల చిన్నవని, ఎంత నీటిని బయటకు పంపుతారని రైతులు ప్రశ్నిస్తున్నారు. అక్కడకు వచ్చిన ఎస్ఈ వద్ద రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ పనిచేసే యంత్రాంగం నిర్లక్ష్యం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని పిర్యాదు చేశారు. నీరు లేనప్పుడు తూము గేట్లు మెయింట్ నెన్స్ చేయలేదని, అందుకే ఈ పరిస్థితి వచ్చినట్లు వారు పిర్యాదు చేసారు. షట్టర్ గేటు మరమ్మతులకు రైతులే పూనుకునే దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందని అక్కడకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే దివి శివరాం ఎస్ఈ దృష్టికి తీసుకెళ్లారు. నీటిని విడుదల చేసేందుకు అన్నీ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎస్ ఈ రైతులకు తెలిపారు.నీటి విడుదల విషయంలో అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.