- సైదాపురం.. కలిచేడులో మద్యం షాపును వ్యతిరేకిస్తున్న మహిళలు
- అధికారపార్టీకి చెందిన ఓ వ్యాపారి బెదిరింపులు
- మీడియావారిపైనా దౌర్జన్యం
ప్రజలకు ఇబ్బంది కలిగించే చోట మద్యం షాపు ఏర్పాటు చేయకూడదని కలిచేడుగ్రామ మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా ఈ మద్యం షాపు వద్దంటూ.. వారంతా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. అయినా ఎవరూ పట్టించుకోవడంలేదు.. మద్యం వ్యాపారులు ఇష్టం వచ్చింది చేసుకోండి అంటూ.. ఆ షాపు పనిలో నిమగ్నమై .. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చివరకు పాలకులు, అధికారులు సైతం ఆ గ్రామ ప్రజల గోడు పట్టించుకోవడంలేదు. కనీసం సమాధానం కూడా ఇవ్వడంలేదు.
నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని కలిచేడు గ్రామానికి వెళ్లే రోడ్డులో ఓ మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో నిత్యం రాకపోకలు సాగిస్తుంటారని.. మహిళలు, విద్యార్థులు, యువతులకు ఇబ్బంది కరంగా ఉంటుందని.. ఆ మద్యం దుకాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. రాత్రి సమయాల్లో దూర ప్రాంతాల నుంచి గ్రామాలకు వచ్చే వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందని.. అక్కడి మద్యం బాబుల నుంచి ప్రమాదం పొంచి ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ షాపును వేరే చోటకు మార్చుకోవాలని వారు కోరుతున్నారు. అలాగే.. చెరువు కట్టకింద బఫర్ జోన్ నిబంధనలకు వ్యతిరేకంగా పెద్ద కంటైనర్ లో షాపు పెడితే.. ఏదైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందంటున్నారు.
అధికారపార్టీకి చెందిన కొందరు స్థానికులపైకూడా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని.. ఈ ఆందోళన కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపైనా దురుసుగా ప్రవర్తించడంతోపాటు ఆ మద్యం వ్యాపారి బెదిరింపులకు పాల్పడ్డం.. అంతుచూస్తామని హెచ్చరించడం కూడా చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఎమ్మెల్యే, అధికారులు పట్టించుకోవాలని.. ఆ మద్యం దుకాణాన్ని అక్కడి నుంచి మార్చాలని స్థానికులు కోరుతున్నారు.