- జర్మనీలో ఎమ్మెస్సీ చేసేందుకు వెళ్లిన ఉపేంద్రరెడ్డి
- మృతి విషయాన్ని గోప్యంగా ఉంచిన అక్కడివారు
- రెండు రోజుల తర్వాత స్నేహితుల సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు
- కన్నీరుమున్నీరవుతున్న ఉపేంద్రరెడ్డి తల్లిదండ్రులు
- విషయం తెలుసుకుని ఫోన్ ద్వారా తల్లిదండ్రులను పరామర్శించిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్
ఉదయగిరిలోని బీసీ కాలనీకి చెందిన ఉపేంద్ర రెడ్డి ఎమ్మెస్ ఉన్నత విద్యను అభ్యసించడానికి జర్మనీకి వెళ్ళారు. గడిచిన రెండు రోజులుగా అతనికి ఫోను చేయడానికి ప్రయత్నించిన కుటుంబ సభ్యులకు అందుబాటులోకి రాకపోవడంతో కలవరపడ్డారు. అనంతరం అతని స్నేహితులను ఫోన్ ద్వారా సంప్రదించిన… కుటుంబ సభ్యులకు పిడుగు లాంటి వార్త అందింది. ఉపేందర్ రెడ్డి హార్ట్ ఎటాక్ తో మృతి చెందినట్లు స్నేహితులు తెలుపగా కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. మృతి విషయమై అక్కడి వారు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, తాము సంప్రదించేంతవరకు విషయాన్ని తెలియపరచకపోగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పే సమాచారం అతని మృతి పట్ల పలు అనుమానాలకు తావిస్తుందని కుటుంబ సభ్యులు వాపోయారు. తమ బిడ్డ కడచూపును తమకు కల్పించాలని వారు అర్థిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టిస్తుంది. కాగా ఈ విషయం తెలుసుకున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఫోన్ ద్వారా అతని తల్లిదండ్రులతో మాట్లాడి అన్ని విధాల తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు.