- శివనామస్మరణలతో మారుమ్రోగిన గణేష్ఘాట్
- వైభవంగా కార్తీక దీపోత్సవం, మహిళా శోభాయాత్ర
- అన్నీ తానైన కోటంరెడ్డి సోదరులు
కార్తీకదీపోత్సవం సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఆయన సోదరులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డిలతోపాటు సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నెల్లూరు నగరంలోని గణేష్ ఘాట్వద్ద మహా కార్తీక దీపోత్సవం, మహిళా శోభాయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 10 గంటలవరకు గణేష్ ఘాట్ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఎమ్మెల్యే కోటంరెడ్డి దగ్గరుండి ఆయా కార్యక్రమాల్లో ఎక్కడా అంతరాలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ముందుగా మహిళలు కార్తీక దీపాలను చేతపట్టి.. మహా శోభాయాత్రను విజయవంతం చేశారు. ఆ సమయంలో జోరు వాన కురిసినా.. అది వారందర్నీ ఆశీర్వదించినట్లైంది. హర హర మహాదేవ్.. శంభో శంకరా అంటూ గణేష్ ఘాట్ ప్రాంతం అంతా శివనామ స్మరణలతో మారుమ్రోగింది. 108 పడవలతో శివాకృతి కార్యక్రమం అయితే మహాద్భుతమే. హరిద్వార్ నుంచి వచ్చిన పిండితులతో గంగా హారతి కార్యక్రమంతో.. అందరూ భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. అది కాశీలోని గంగాహారతిని తలపించింది. అలాగే.. దేశంలోని మహా పుణ్యనదుల నుంచి జలాలను తెప్పించి.. గణేష్ ఘాట్కు వచ్చే భక్తులకు డ్రోన్లద్వారా సంప్రోక్షణ చేయడంతో భక్తులంతా భక్తిపారవశ్యంతో తన్మయత్వం చెందారు. ఈ కార్యక్రమం సందర్భంగా చిన్నారులు, మహిళలు, వివిధ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలతో అందర్నీ ఆకట్టుకున్నారు. అలాగే.. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిధులుగా వెంకయ్యనాయుడు సతీమణి ఉషమ్మ, కుమార్తె దీపా వెంకట్లు హాజరయ్యారు. ప్రవచనకర్తలు గంగాధర్ శాస్త్రి, మాతృశ్రీల ప్రవచనాలు భక్తులను ఆసాంతం ఆకట్టుకున్నాయి.