- నెల్లూరు పరమేశ్వరినగర్లో మద్యం దుకాణం వద్దే వద్దు
- పది రోజులకుపైగా నిరవదిక నిరాహారదీక్ష
- పార్టీలకు అతీతంగా దీక్షలో పాల్గొంటున్న నేతలు, స్థానికులు
- వ్యాపారులు, అధికారులు, పాలకుల్లో చలనం లేదంటూ ఆవేదన
తమ ప్రాంతంలో ఏర్పాటుచేసిన మద్యం దుకాణాన్ని తీసేయాలంటూ.. స్థానికులు ఉద్యమం చేపట్టి నేటితో పది రోజులుదాటిపోయింది. అయినా.. మద్యం వ్యాపారుల్లో చలనం లేదు.. అధికారుల్లో కదలిక లేదు.. పాలకుల్లో కాస్తైనా దయ లేదు.. దాంతో మద్యం వ్యాపారులు మాత్రం తమ వ్యాపారాన్ని వారు చేసుకుంటూ పోతున్నారు. పిల్లలకు, మహిళలకు మద్యం బాబుల వల్ల ఇబ్బందులు మాత్రం తప్పటం లేదు. ఇంతకు పది రోజులుగా ఈ ఉద్యమం చేస్తుంది ఎక్కడో కాదు.. నెల్లూరు నగరం పరమేశ్వరి నగర్లో.. తమ ప్రాంతంలో.. ఇళ్ల మధ్య.. బడులు, దేవాలయాలు, మసీదులు, ఇతర ప్రార్థనా మందిరాలున్న ప్రాంతం అది.
ఎప్పుడూ.. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.. ఎవరి పనులు వారు చేసుకుంటూ వెళ్తుంటారు. ఈ మద్యం దుకాణం ఏర్పాటుతో న్యూసెన్స్ క్రియేట్ అవుతుందని.. ఆ ప్రాంత వాసులు ఆందోళనకు దిగారు. వ్యాపారులు, అధికారులు, చివరకు పాలకులు కూడా వారి మొర ఆలకించకపోవడంతో.. పది రోజుల నుంచి పార్టీలకు అతీతంగా టీడీపీ, వైసీపీ, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ తదితర రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఏకమై.. మద్యం దుకాణాన్ని తొలగించాలంటూ నిరవదిక నిరాహార దీక్ష చేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకు ఈ దీక్షలో చిన్న పెద్ద, మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా పాల్గొంటున్నారు.