సీహెచ్ సీ డాక్టర్లపై ఎమ్మెల్యే ఆగ్ర‌హం

  • ఆ.. కాంట్రాక్టర్లపై కేసులు పెట్టండి
  • బడి పిల్లల భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించండి
  • బుచ్చి మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆమెకు బుచ్చిరెడ్డి పాళెం నాయకులు ఘన స్వాగతం పలికారు. తిరుమల తిరుపతి ఆలయ పాలక మండలి సభ్యురాలిగా నియమితులైన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి స్థానిక నాయకులు, అధికారులు అభినందనలు తెలియజేశారు. మండల సర్వ సభ్య సమావేశంలో ముందుగా విద్యాశాఖకు సమందించిన పురోగతిని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ప్రధాన ఉపాధ్యాయులు సభ దృష్టికి తెచ్చారు. వివిధ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల లేమిని వివరించారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు విద్యార్థినీ విద్యార్థులకు చదువుతో పాటు బాల్య దశ నుంచే మౌలిక విలువలు బోధించాలని కోరారు.

బడి పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. గత ప్రభుత్వం హయాంలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకుండానే బిల్లులు డ్రా చేసుకున్న కాంట్రాక్టర్లను గుర్తించి కేసులు పెట్టి స్వాహా చేసిన ప్రభుత్వ ధనాన్ని రికవరీ చేయాలని ఆమె హోసింగ్ అధికారులను ఆదేశించారు. బిజెపి ఎంపిటిసి వినయ్ నారాయణ లేవనెత్తిన ప్రశ్నల పై స్పందించిన ఎమ్మెల్యే 24 గంటలు సేవలు అందివ్వాల్సిన బుచ్చి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో రాత్రులు డాక్టర్లు అందుబాటులో ఉండని విషయంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఎంపిపి మన్నేపల్లి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన మండల సర్వ సభ్య సమావేశంలో ఎంపిడిఓ శ్రీహరి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, జెడ్పిటిసి శ్రీదీపలతో పాటు మండల పరిధిలోని ఎంపిటిసిలు, సర్పంచులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *