- అజెండాలో తదుపరి కౌన్సిల్కి 4 వాయిదా
- 5 తీర్మానాలు రివైజ్
- అందరి సహకారంతో నగరాన్ని అభివృద్ధి పథంలోకి నడుపుతాం
- కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో మేయర్ స్రవంతిజయవర్ధన్
జిల్లాకు చెందిన అందరు ప్రజా ప్రతినిధుల సహకారంతో, నెల్లూరు నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారుల పర్యవేక్షణలో నగరాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తామని కార్పొరేషన్ మేయర్ పొట్లూరి స్రవంతి పేర్కొన్నారు. నగర పాలక సంస్థ సాధారణ సర్వ సభ్య సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయంలోని డాక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలామ్ కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించారు. మేయర్ స్రవంతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నగర పాలక సంస్థ అన్ని డివిజనుల కౌన్సిల్ సభ్యుల సమక్షంలో ప్రవేశపెట్టిన 73 తీర్మానాలను అజెండాగా ప్రకటించగా, 64 తీర్మానాలను కౌన్సిల్ ఆమోదించారు. అజెండాలో 4 తీర్మానాలను తదుపరి కౌన్సిల్ సమావేశానికి వాయిదా వేయగా, 5 తీర్మానాలను రివైజ్ చేయడం జరిగింది.
కౌన్సిల్ సమావేశంలో పలువురు కార్పొరేటర్లు పలు సమస్యలను మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… నగర వ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణ పనులు ప్రణాళికాబద్ధంగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నామని తెలిపారు. కార్పొరేషన్ కమిషనర్, అన్ని విభాగాల అధికారులు, సిబ్బందితో పాటు నగర ప్రజలందరి సహకారంతో నెల్లూరు నగర పాలక సంస్థ ఉన్నతి సాధించేలా సమన్వయంగా కృషి చేస్తామని మేయర్ ఆకాంక్షించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ చంద్ర శేఖర్ రెడ్డి, నగర పాలక సంస్థ అన్ని డివిజనుల కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, కమిషనర్ సూర్యతేజ, నగర పాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.