- నెల్లూరులో వృద్ధురాలిని హత్య చేసిన తండ్రి, కూతురు
- శవాన్ని మాయం చేసేందుకు చెన్నైకు తరలింపు
- మీంజూరు రైల్వేస్టేషన్లో అక్కడి పోలీసులకు పట్టబడ్డ నిందితులు
- నగల కోసమే హత్య చేసినట్లు నిర్ధారణ
- ఖర్మ ఎవర్నీ వదిలిపెట్టదనేందుకు ఇదే నిదర్శనం
ఖర్మ ఎవర్నీ వదిలి పెట్టదంటారు.. అది నూటికి నూరుపాళ్లు నిజం .. కొద్ది గంటల్లోనే ఓ తండ్రి, కూతురు విషయంలో నిరూపించింది.. నగల కోసం ఓ వృద్ధురాలిని అతి కిరాతకంగా చంపేశారు.. ఆమె శవాన్ని సూట్ కేసులో పెట్టుకుని.. మాయం చేసేపనిలో ఊరుగాని ఊరు.. రాష్ట్రంగాని రాష్ట్రం వెళ్లి..పోలీసులకు దొరికిపోయారు. అన్యంపుణ్యం ఎరుగని ఆ వృద్ధురాలిని కిరాతకంగా చంపేసి.. సూట్కేసులో కుక్కేసి.. చెన్నైలో పడేద్దామనుకుని ఇలా.. పోలీసులకు దొరికిపోవడంతో ఖర్మసిద్ధాంతం నిజమని నిరూపించింది. ఈ హత్య జరిగిన కొన్ని గంటల్లోనే హంతకులు పోలీసులకు పట్టుబడ్డ సంఘటన ఇది.. హత్య నెల్లూరులో జరిగితే.. వారు పట్టబడింది చెన్నైలోని మీజూరు రైల్వేస్టేషన్లో.. ఇంతకూ ఏం జరిగింది..? హత్యకు కారణాలేంటీ..? పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి.
నెల్లూరు నగరం.. సంతపేటకు చెందిన రమణి అనే వృద్ధురాలు సోమవారం ఉదయాన్నే కూరగాయల కోసం అక్కడే ఉన్న ఓ దుకాణానికి వెళ్లింది. ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారించినా ప్రయోజనం లేకపోయింది. సీన్ కట్చేస్తే.. కూరగాయలకు వెళ్లిన రమణిని అదే ప్రాంతానికి చెందిన సుబ్రహ్మణ్యం.. అతడి కుమార్తె దివ్యలు వెంబడించారు. అప్పటికే రమణితో వారికి పరిచయం ఉండటంతో.. మాట మాట కలిపారు. ఆ తర్వాత ఆమెను అక్కడే ఉన్న వారింటికి తీసుకెళ్లారు. ఆమె ఒంటిపై ఉన్న నగలను లాక్కున్నారు. బలమైన ఆయుధంతో ఆమెను హత్య చేశారు. ఆ రోజంతా..శవాన్ని ఇంట్లోనే ఎవరి కంటా పడకుండా దాచారు. రాత్రికి ఓ ట్రావెల్ సూట్కేసులో రమణీ శవాన్ని కుక్కారు. ఊరెళ్తున్నామంటూ.. చుట్టుపక్కలవారిని నమ్మించి.. నెల్లూరు రైల్వే స్టేషన్కు వెళ్లి.. అక్కడి నుంచి చెన్నై కు వెళ్లే రైలు ఎక్కేశారు.
అర్థరాత్రి దాటాక.. చెన్నైకి సమీపంలోని మీంజూరు రైల్వే స్టేషన్లో జనసంచారం లేకపోవడంతో అక్కడ శవం ఉన్న సూట్కేసుతో దిగేశారు. కొద్ది సేపటికే అక్కడ విధుల్లో ఉన్న రైల్వేపోలీసులు వీరిని గుర్తించారు. వారిని విచారించారు. వారి కదలికలు అనుమానాస్పందంగా.. ముఖకవలికలు భయాందోళనతో ఉండటంతో.. వారికి అనుమానం వచ్చి.. సూట్ కేసులో ఏముందో చూపించమన్నారు. ఇంకా ఎక్కవ కంగారుపడ్డంతో.. ఇక ఆ పోలీసులే కలుగ చేసుకుని.. దాన్ని ఓపెన్ చేశారు. అంతే.. అందులో వృద్ధురాలి శవం. ఆ పోలీసులు కూడా అవాక్కై.. విస్మయానికి గురయ్యారు. ఈవిషయం క్షణాల్లో మీంజూరు రైల్వే స్టేషన్ సిబ్బందికి, రైల్వే పోలీసులకు తెలిసిపోవడంతో అందరూ గుమికూడారు. వారిని స్టేషన్కు తరలించి.. గట్టిగా మందలించి.. విచారించడంతో అసలు ఈ హత్య విషయాన్ని కక్కేశారు. దీంతో మీంజూరు పోలీసులు నెల్లూరు సంతపేట సీఐ మద్ది శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. హుటాహుటీన సంతపేట పోలీసులు చెన్నైకు తరలి వెళ్లారు.
ఈ హత్యకు ముందే.. ఆ తండ్రి, కూతుళ్లు.. రమణీ కదలికలపై కన్నేశారు. మూడు రోజులుగా ఆమె ఏ టైంలో బయటకు వెళ్తుంది..? ఎక్కడెక్కడ తిరుగుతుంది..? అన్ని వివరాలూ సేకరించి పెట్టుకున్నారు. అంతే పథకం ప్రకారం.. ఆమె సోమవారం ఉదయాన్నే కూరగాయలకు వెళ్తుండగా.. ఆమెను అనుసరించి.. ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు పోలీసులు అంటున్నారు. అక్కడి పోలీసుల వివరాల మేరకు.. ఆమె వంటిపై ఉన్న నగలు కోసమే.. ఈ హత్యకు పాల్పడ్డట్టు ఆ తండ్రి కూతుళ్లు తెలిపినట్లు తెలుస్తోంది. నెల్లూరు సంతపేట పోలీసులు నిందితులను నెల్లూరుకు తీసుకొచ్చి.. లోతుగా విచారిస్తే.. అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ హత్యకుగల మోటీవ్.. ఏ వెపన్తో హత్య చేశారు..? ఈ హత్యకు ఇంకెవరైనా సహకరించారా..? తండ్రి, కుమార్తె పట్టుబడ్డారుకాబట్టి.. వారిద్దరూ కలసి ఈ హత్య చేశారా..? తండ్రి సుబ్రహ్మణ్యం ఒక్కడే హత్య చేశాడా..? కూతురు అతడికి సహకరించిందా..? ఎక్కడ హత్య చేశారు..? ఇంట్లోనా..? బయటా..? పగలంతా శవాన్ని ఎవరి కంటా పడకుండా ఎలా దాచారు..? అనే చిక్కుముళ్లకు సమాధానం దొరనుంది. ఏది ఏమైనా ఈ మర్డర్.. నెల్లూరులో సంచనలంగా.. చర్చనీయాంశంగా మారింది.