- లేని పక్షంలో దశల వారీ ఉద్యమం చేపడుతాం
- వెంకటేశ్వరపురం సెంటర్లో సీపీఎం ఆధ్వర్యంలో ప్రజలతో సామూహిక నిరసన ధర్నా
53వ డివిజన్ భారత కమ్యూనిస్టు పార్టీ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని వెంకటేశ్వరపురం సెంటర్లో స్థానిక ప్రజలందరూ కలిసి రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ… సామూహిక నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ధర్నా అనంతరం 53వ డివిజన్ సచివాలయం అడ్మిన్ సెక్రటరీ చైతన్యకు వినతి పత్రం సమర్పించారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి… లేకుంటే ఉద్యమాలు చేపడుతాం అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్, నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి నాగేశ్వరరావు మాట్లాడారు. నెల్లూరు నగరపాలక సంస్థకు ఇంటి పన్నులు, భవన నిర్మాణ అనుమతులకు ఫీజులు చలానాలు కోట్ల రూపాయల ప్రజలు చెల్లిస్తున్నారని అన్నారు.అయినా రిజిస్ట్రేషన్ పట్టాలు లేకపోవడం విచారకరమని అన్నారు.
తక్షణమే సమస్య తీవ్రతను అర్థం చేసుకొని జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదికను సమర్పించి సమస్య పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో దశలవారీ ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. ఈ నిరసనలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.