- వెంటనే చెరువు శుద్ధి చేయించాలి
- అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
- గూడూరులో రైతు సంఘం గూడూరు కమిటి, సీపీఎం, సీఐటీయూ నిరసన
తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కడివేడు గ్రామం చెరువును విషపూరితం చేస్తున్న పోర్టు వ్యర్ధాలను అరికట్టాలని కోరుతూ… ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గూడూరు కమిటి, సీపీఎం, సీఐటీయూ ఆద్వర్యంలో గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు… కొందరు అక్రమార్కులు సంపాదనే ధ్యేయంగా పోర్టు నుండి విషపూరిత దుర్గంధమైన వ్యర్థాలను భారీ ఎత్తున డ్రమ్ముల్లో తీసుకువచ్చి కడివేడు చెరువు వద్ద పడవేస్తున్నారని , దీంతో చెరువు జలాలు విషతుల్యంగా మారుతున్నాయని అన్నారు…చెరువులో చేపలు, పశువులు మూగజీవాలు విషతుల్యమైన నీటిని తాగి మృత్యువాత పడుతున్నాయన్నారు… కడివేడు, తిమ్మనగారిపాలెం, కమ్మవారిపాలెం, గుత్తావారి పాలెం గ్రామాల చెరువులు విషపూరిత వ్యర్ధాల కారణంగా కలుషితమవుతున్నాయని, ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు… ఇప్పటికైనా అధికారులు స్పందించి లాభం కోసం విషపూరితమైన పోర్టు వ్యర్థాలను తీసుకువచ్చి చెరువుల వద్ద పడవేస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకుని, విషపూరితంగా మారిన చెరువులను శుద్ధిచేయించాలని డిమాండ్ చేశారు.