- నెల్లూరు జీజీహెచ్లో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం
- పేషెంట్ కుటుంబ సభ్యుల్ని బెదిరించిన ఆ డాక్టర్
- నువ్వు సరిగ్గా మాట్లాడమ్మ…తిక్క తిక్కగా మాట్లడొద్దు
- ఇదేం ప్రైవేట్ హాస్పిటల్ కాదు
- నువ్వేంది…ఐసీయూలోకి షిఫ్ట్ చేయమనేది
వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ మృతి చెందిన దారుణ ఘటన… నెల్లూరు పెద్దాసుపత్రిలో చోటు చేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాల మేరకు… నెల్లూరు బుజ బుజ నెల్లూరు భగత్ సింగ్ కాలనీకి చెందిన రాచూరి లక్ష్మి అనారోగ్యానికి గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెని చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు.
రాచూరి లక్ష్మిని ఆసుపత్రిలోని ఐపీ బిల్డింగ్లో అడ్మిట్ చేశారు. మా అమ్మకి బాగా ఇబ్బందిగా ఉంది…తొందరగా ట్రీట్ మెంట్ చేయండని…వార్డులో ఉన్న స్టాఫ్ నర్శులకి కుటుంబ సభ్యులు తెలిపారు. అయినా కూడా వారు పట్టించుకోలేదు. ఇదే సమయంలో ఐపీ బిల్డింగ్లో మరో డాక్టర్ ని కలిశాం. ఈ వార్డు నాది కాదని…వేరే డాక్టర్ అని తమకు సంబంధం లేదని చెప్పేసి వెళ్లిపోయారు.
దీంతో స్టాఫ్ నర్శిని గట్టిగా నిలదీయడంతో…ఒక గంట తరువాత డాక్టర్ పీ రవిబాబు వచ్చారు. మా తల్లి కేస్ షీట్ చూసి…మేము చెప్పేది వినకుండా…మమ్మల్ని నోటికొచ్చినట్లు మాట్లాడారు. నువ్వు సరిగ్గా మాట్లాడమ్మ…తిక్క తిక్కగా మాట్లడొద్దు… ఇదేం ప్రైవేట్ హాస్పిటల్ కాదు…నువ్వేంది…ఐసీయూలోకి షిఫ్ట్ చేయమనేది అంటూ తమను బెదిరించారు. దీంతో మా అమ్మకి సకాలంలో వైద్యం అందించకపోవడంతో ఆమె అక్కడే ప్రాణాలు విడిచినట్లు మృతురాలి లక్ష్మి కుమారుడు, కుమార్తెలు బోరున విలపించారు.
కేవలం డాక్టర్, స్టాఫ్ నర్శుల నిర్లక్ష్యం కారణంగానే తమ తల్లి చనిపోయిందని మండిపడ్డారు. వెంటనే కలెక్టర్ పూర్తి స్థాయి విచారించి…మా అమ్మ మరణానికి కారణమైన వారిని సస్పెండ్ చేసి…చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.